ఒక్క పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు, వైసీపీ అనుసరిస్తున్న వంకర వ్యూహాలు, అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇప్పుడేమో పిఠాపురం.. ఇదో పెద్ద ప్రసహనంగా తయారైంది వైసీపీకి.!
ప్రస్తుతానికైతే కుట్రల కేంద్రం పిఠాపురం.! పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ ఖాయమవుతుందన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న వైసీపీ, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ‘నేను హీరో..’ అంటూ ముద్రగడ పద్మనాభం, వైసీపీలో చేరి, జనసేనాని మీద చేసిన విమర్శల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఆ ముద్రగడ పద్మనాభం, పిఠాపురం కేంద్రంగా, కాపు నేతల్ని వైసీపీ వైపుకు తిప్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసీపీ సామ ధాన బేధ దండోపాయాలన్నిటినీ అమలు చేస్తోంది. ఈ క్రమంలో పలువురు కాపు నేతలు, వైసీపీ వైపు వెళుతున్నారు.. జనసేనని వీడి మరీ.!
అయితే, ఏం చేసినా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించడం ఖాయమని, స్థానిక వైసీపీ శ్రేణులే భావిస్తున్నాయట. ఈ క్రమంలో తమ వంకర వ్యూహాలకు మరింత పదును పెడుతోంది వైసీపీ.
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఎప్పటికప్పుడు పిఠాపురంలో జనసేన పార్టీని ఓడించడంపై తనదైన వ్యూహాల్ని రచిస్తూ వెళుతన్నారు. మండలానికో ఇన్ఛార్జిని నియమించింది వైసీపీ, జనసేనని ఓడించడానికి.
అయితే, పిఠాపురం చాలా చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. గతంలో ఇండిపెండెంట్లు కూడా గెలిచిన నియోజకవర్గమిది. అదే సమయంలో, ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ విజయం దక్కింది గతంలో. అందుకే, వైసీపీలో మరింత కంగారు పెరిగింది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తే, తమకు రాజకీయంగా పుట్టగతులు వుండవని భావిస్తున్న వైసీపీ, ఎలాగైనా పవన్ కళ్యాణ్ని ఓడించాలన్న ఉద్దేశ్యంతో అప్పుడే పంపకాలకూ తెరలేపింది.
ఓటుకి పది వేల నుంచి లక్ష వరకు అయినా ఖర్చు పెట్టడానికి వైసీపీ వెనుకాడ్డంలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. మండలానికో ఇన్ఛార్జి కాదు, ముందు ముందు గ్రామానికి ఓ ఇన్ఛార్జి అయినా వైసీపీ నుంచి నియమితులయ్యే అవకాశాల్లేకపోలేదు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు సహకరించాల్సింది పోయి, తెరవెనుకాల వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
వర్మని ముందుగానే వైసీపీ తన వైపుకు తిప్పుకుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేనాని గెలుపుకి సహకరిస్తానని చెబుతూనే, వర్మ తన మార్కు కుయుక్తుల్ని పన్నుతున్నారు. ఆయన వెకిలి చేష్టల్ని చూసీ చూడనట్టు వదిలేస్తోంది టీడీపీ.
ఇలా తన చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నా.. ఇవేవీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఊహించని విషయాలు కావు. ఎవరెన్ని కుట్రలు పన్నినాగానీ, ‘లక్ష మెజార్టీ..’ అంటూ సంచలన వ్యాఖ్యల చేశారు జనసేనాని ఇటీవలే.!
ఒక్కడ్ని ఓడించేందుకు వైసీపీ పన్నుతున్న ఈ పన్నాగాలన్నీ పటాపంచలవడం ఖాయంగానే కనిపిస్తోంది. 2019లోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి వుండాల్సిందని, ఆయన పోటీ చేసి వుంటే, గెలిపించుకునేవాళ్ళమనీ.. స్థానికంగా పిఠాపురం ఓటర్లు చర్చించుకుంటున్నారంటే, ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఏ రేంజ్లో వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
కుట్రలు, వంకర వ్యూహాలు.. వైసీపీ నుంచి ఎన్నికల పోలింగ్ వరకూ నడుస్తూనే వుంటాయ్. వైసీపీ అనుకూల మీడియా వెకిలితనం, వైసీపీ కోవర్టులు.. దానికి తోడు టీడీపీ నేత వర్మ మార్కు రాజకీయ పైత్యాలు.. ఇలా ఎవరు ఏం చేసినా సరే, 50 వేల మెజార్టీకి తగ్గకుండా జనసేనాని బంపర్ విక్టరీ పిఠాపురం నుంచి నమోదు చేయబోతున్నారన్నది నిర్వివాదాంశం.