Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గాజు గ్లాసు గుర్తు తమకే వస్తుందని జనసేన వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. అయితే.. గుర్తును తమకే కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తామే ముందుగా దరఖాస్తు చేసుకున్నామని.. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వాదించింది. ఇరు వాదనలు విన్న కోర్టు ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ డిస్మిస్ చేసింది.
ఇటివల ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ లిస్టులో చేర్చడంతో జనసేన వర్గాలు గందరగోళంలో పడ్డాయి. దీంతో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని ఎన్నికల కమిషన్ ను కోరాలని భావించగా.. ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది.