ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.!
టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బీజేపీలో టీడీపీ – జనసేన అనుకూల వర్గం, వైసీపీ అనుకూల వర్గం.. అనేవి వున్నాయి. నిజానికి టీడీపీ అనుకూల, బీజేపీ అనుకూల, జనసేన అనుకూల, వైపీపీ అనుకూల.. అనే నాలుగు వర్గాలుండేవి.
నిఖార్సయిన బీజేపీ వర్గం, అధినాయకత్వం చెప్పినట్లుగా టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇందులో వింతేమీ లేదు. వైసీపీ అనుకూల వర్గమే, టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతోంది.
ట్వీట్ల పరంగా కావొచ్చు, స్పేస్ల పరంగా కావొచ్చు, బీజేపీ అభ్యర్థుల మీదనే, బీజేపీలోని వైసీపీ వర్గం అత్యంత జుగుప్సాకరమైన నెగెటివిటీ షురూ చేసింది. ప్రధానంగా రాజమండ్రి కూటమి అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై ఈ వర్గం చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.
రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు నామమాత్రం. అంటే, ఒకటి నుంచి రెండు శాతమే. కానీ, బీజేపీకి ఆరు లోక్ సభ సీట్లు కూటమి తరఫున దక్కాయి. పది అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ పొత్తులో భాగంగా దక్కించుకుంది. వీటిల్లో ఎన్ని గెలుస్తుంది బీజేపీ.? అంటే, అది జనసేన – టీడీపీ దయ మీద ఆధారపడి వుంటుందన్నది బహిరంగ రహస్యం.
పొత్తుల్లో కొన్ని ఈక్వేషన్స్ వుంటాయి. అవన్నీ ఆయా పార్టీల అధినాయకత్వాలకి తెలుసు. క్యాడర్ కూడా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతుంటుంది. కానీ, బీజేపీలోని వైసీపీ వర్గం మాత్రం, సర్దుకోలేకపోతోంది.. జీర్ణించుకోలేకపోతోంది కూటమిని.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రిలో పురంధేశ్వరిని గెలవనివ్వబోమని సోకాల్డ్ ఇంటర్నెట్ మేధావులైన కమలం కార్మికులు శపథాలు చేసేస్తున్నారు. వాటిని బీజేపీ అధినాయకత్వం పట్టించుకోదనుకోండి.. అది వేరే సంగతి. కాకపోతే, బీజేపీ ముసుగేసుకుని, కూటమిని విమర్శిస్తున్నవారి వల్ల, బీజేపీ అభ్యర్థులకు కూటమిలోని ఇతర పార్టీల నుంచి ఓటు ట్రాన్స్ఫర్ అనేది సజావుగా సాగకపోవచ్చు.
ఆల్రెడీ కూటమికి దక్కాల్సిన సీట్లు కాస్తా, బీజేపీకి కేటాయించడంతో.. బీజేపీ ఓటమి అంటే వైసీపీ గెలుపు.. అన్నట్లుగా మారుతుందేమో పరిస్థితి అని టీడీపీ, జనసేన ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.
ఏదిఏమైనా బీజేపీలోని వైసీపీ వర్గం పట్ల బీజేపీ అధినాయకత్వం ఒకింత అప్రమత్తంగా వుండాలి. లేదంటే అది కూటమికి చేటు తెస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న దరిమిలా, అప్పటికైనా ఈ గందరగోళం చల్లారుతుందేమో వేచి చూడాలి.