పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ.. అని అధికార వైసీపీ అంటోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ గనకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సేఫ్ జోన్’గా భావించి, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికే చెందిన వంగా గీత వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆమె ప్రస్తుతం లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. కాకినాడ నియోజకవర్గం నుంచి, వైసీపీ తరఫున.
గతంలో, ఇదే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ నేత వర్మ గెలిచిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన గెలిచారు అప్పట్లో. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలూ ఓటర్లుగా వున్నారు. కానీ, వైసీపీ తనకు తోచిన వాదనను తెరపైకి తెస్తోంది.
ఇదిలా వుంటే, పిఠాపురం నుంచి బరిలోకి దిగాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భావించారు. జనసేన నుంచి టిక్కెట్టు కూడా ఆశించారాయన. అది కుదరక, ముద్రగడ వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే.
కాపు సామాజిక వర్గం ఓట్లే పిఠాపురంలో అధికంగా వున్నాయని వైసీపీ భావిస్తున్నప్పుడు, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి లేదా నాయకురాలికి పిఠాపురం బాధ్యతలు అప్పగించాలిగానీ, రాయలసీమ నుంచి తీసుకొచ్చి, మిధున్ రెడ్డిని పిఠాపురం ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దడమేంటి.?
ఒక్కో ఓటుకి లక్ష అయినా ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా వుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారంటే, అది కేవలం ఆయన మాట మాత్రమే కాదు.. నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ కూడా.!
ఓ రాజకీయ పార్టీ, తన రాజకీయ అవసరాల కోసం ఎవర్నైనా ఎక్కడైనా నియమించుకోవచ్చుగాక. కానీ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి అసలు సమర్థుడైన నాయకుడే లేనట్టు, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని దించడమేంటి.? అదీ, వంగా గీత లాంటి సీనియర్ నాయకురాలి మీద పెత్తనానికి.? అన్న చర్చ సహజంగానే జరుగుతోంది.
పెద్దిరెడ్డి రాజకీయం ఎలా వుంటుందో, చిత్తూరు జిల్లాలో.. అందునా, పుంగనూరులో అందరికీ తెలుసు. తిరుపతి ఉప ఎన్నిక ఈ ‘పెద్దిరెడ్డి’ కనుసన్నల్లోనే జరిగింది. విచ్చలవిడిగా దొంగ ఓటర్లు వేరే రాష్ట్రాల నుంచీ తరలి వచ్చారు అప్పట్లో. అదే పైత్యం, పిఠాపురం నెత్తిన వైసీపీ ఈ ‘పెద్దిరెడ్డి’ ద్వారా రుద్దబోతోందా.? అంతేనేమో.!