దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు జరిపి దాని ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఉన్న ప్రచార సంప్రదాయానికి పాతరేసి కొత్త పోకడలకు తెరతీస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల వేళ పార్టీలకు కర్త, క్రియ,కర్మ అన్నీ వారే.
అలా మొదలైంది ప్రశాంత్ కిషోర్ తోనే…
ప్రచార కర్తల సంప్రదాయం మొదలైంది ప్రశాంత్ కిషోర్ తోనే. పదేళ్ల క్రితం ఆయన సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్( CAG) ని స్టార్ట్ చేశారు. రెండేళ్ల తర్వాత అది ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( I-PAC) గా మారింది. 2014 నుంచి ఈ సంస్థ పలు ఎన్నికల్లో పార్టీల తరఫున వ్యూహాలు రచించడం ప్రారంభించింది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పనిచేసే ఆ పార్టీ 282 సీట్లు గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల్లో బీజేపీ ఫాలో అయిన చాయ్ పే చర్చ, బ్రాండ్ మోదీ, ఐక్యత ఉద్యమం, మోదీని వికాస పురుషుడిగా అభివర్ణిస్తూ ఏర్పాటుచేసిన త్రీడీ హోలోగ్రామ్ ర్యాలీలు సూపర్ హిట్ అయ్యాయి. అవన్నీ ఐపాక్ డిజైన్ చేయడం విశేషం. ఆ తర్వాత 2019 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సిపి తరఫున ఐపాక్ టీమ్ పనిచేసింది. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ 150 సీట్లు గెలుచుకోవడంలో ఈ టీం కీలకపాత్ర పోషించింది. ఆంధ్ర లో అమలు చేసిన నవరత్నాలు వీళ్ల ఐడియా నే.
రీసెంట్ సెన్సేషన్ సునీల్ కనుగోలు
రాజకీయ వ్యూహకర్తల్లో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి సునీల్ కనుగోలు. ఈయన తొలుత బీజేపీ తరఫున వ్యూహకర్త గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో జతకట్టి కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ భారీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘భారత్ జోడో యాత్ర’ సూపర్ హిట్ అవ్వడంతో సునీల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో ఆయన పేరు మారుమోగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి వంటి పథకాలు కాంగ్రెస్ తన హామీల్లో చేర్చడం వీళ్ల వ్యూహమే. అవి ఓటర్లను ఎంతగానో ఆకర్షించి కాంగ్రెస్ కి అధికారాన్ని కట్టబెట్టాయి.
పార్థ ప్రతిమ్ దాస్ ‘సోషల్’ దారి
దేశ రాజకీయ వ్యూహకర్తల్లో చెప్పుకోదగ్గ మరో వ్యక్తి పార్థ ప్రతిమ్ దాస్. ఈయన రూటే సపరేట్. సోషల్ మీడియాని ఉపయోగించుకొని వ్యూహాలు రచించడం ఈయన ప్రత్యేకత. ఆయన పని చేసే ప్రాంతాన్ని బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి వ్యూహాలు రచిస్తుంటారు. ఉదాహరణకు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా పార్టీ కోసం పనిచేస్తున్నారంటే ముందుగా ఇక్కడ ప్రజల లైఫ్ స్టైల్, ఆర్థిక పరిస్థితులు, అక్షరాస్యత, టెక్నాలజీ వాడకం ఆలోచన విధానాలను స్టడీ చేస్తారు. దాన్ని బట్టి తదుపరి వ్యూహాలను రచిస్తారు. ఈయన 2013లో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేశారు. అదే ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్నికలకు బీజేపీ కోసం పనిచేశారు.