వైఎస్ జగన్, గతంలో వరంగల్ జిల్లాకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూశాం. ఆయన ప్రయాణించిన రైలు మీద రాళ్ళతో దాడులకు దిగారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పీకేయడం తెలిసిన విషయమే.
ఇక, ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తోంది. బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వరంగల్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు.
జనసేన అధినేతకు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున జనసేన, బీజేపీ కార్యకర్తలు సందడి చేశారు. దారి పొడుగునా పూల జల్లు కురిపించారు. ‘అప్పట్లో వైఎస్ జగన్ మీద రాళ్ళ వాన.. ఇప్పుడేమో జనసేనానికి పూల వాన..’ అంటూ నెటిజనం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఫొటోలు, వీడియోలతో సహా.
‘దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం. కనీసం, బీసీ ముఖ్యమంత్రినైనా చూద్దాం. అలా జరగాలంటే బీజేపీ – జనసేన కూటమి గెలవాలి.. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించండి..’ అంటూ జనసేనాని, ఎన్నికల ప్రచార సభలో నినదించారు.
అధికార బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిన ఓ నాయకుడు, కమిషన్ల గురించి మాట్లాడుతున్నాడంటే, ఉద్యమకారులు ఆకాంక్షించిన తెలంగాణ ఇది కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా తిరుగుతున్నానో, తెలంగాణలోనూ ముందు ముందు అలాగే తిరుగుతాననీ, తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన ప్రజల తరఫున నినదిస్తుందనీ జనసేనాని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తెగువని తాను తెలంగాణ నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్.
అసలు తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా.? పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా.? అంటూ రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారాలు చేస్తున్న దరిమిలా, జనసేనాని తెలంగాణ ఎన్నికల ప్రచారం.. అందరి నోళ్ళకూ తాళాలు వేసినట్లయ్యింది.