రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీ-ఫామ్స్ అందించారు.
నామినేషన్ల పర్వం షురూ అవుతున్న దరిమిలా, అభ్యర్థులు తమ తమ వెసులుబాట్లు, జాతక ఫలాల ఆధారంగా సుముహూర్తాలు చూసుకుని నామినేషన్లను దాఖలు చేస్తారు.
బి-ఫామ్స్ అందించే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అభ్యర్థులందరితోనూ ప్రమాణం చేయించారు. ప్రమాణం, ప్రతిజ్ఞ.. పేరేదైతేనేం, రాజకీయాల్లో ఇది నిజంగానే కొత్త ఒరవడి.
‘‘3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని ప్రకృతి వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల.సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల మనకు తిప్పలు తప్పడం లేదు’’
‘‘5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది, మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించుకోవలసి ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, కనుక వారికి జవాబుదారీ గా ఉంటూ, పారదర్శక పాలన అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది.’’
‘‘తెలుగువారి జీవన రేఖ పోలవరం నిర్మాణం పూర్తి, నదుల అనుసందానం, సామాజిక న్యాయం, యువతకు విద్యా, ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి’’
‘‘మన లక్ష్యమైన ప్రతీ చేతికి పని, ప్రతీ చేనుకు నీరు అందించడం ద్వారా, వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్దం చెయ్యడమే మన అందరి ఉమ్మడి భాధ్యత’’
‘‘ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – బీజేపి లతో కూడిన NDA కూటమి గెలుపే కర్తవ్యంగా కృషిచేస్తానని, మన పార్టీ నియమనిబంధనలకు కట్టుబడుతూ, కూటమి అభ్యర్థిగా, పైన తెలిపిన ప్రతీ మాటలు కట్టుబడి ఉంటానని భారత రాజ్యంగం సాక్షిగా ప్రతిజ్ఞ జేస్తున్నాము. జై జనసేన జైహింద్.’’
ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయించిన ప్రతిజ్ఞ, ప్రమాణం.! అభ్యర్థులకు తమ బాద్యతల గురించి అధినేత గుర్తు చేయడం అనేది చాలా చాలా కీలకమైన విషయం ఇక్కడ. ఇదొక ప్రమాణ స్వీకార మహోత్సవంలా జరిగిందని, అభ్యర్థులు అంటున్నారు.
ఈ అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికే చట్ట సభలకు వెళ్ళి వచ్చినవారు. అయినా, వాళ్ళే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయించిన ప్రతిజ్ఞ పట్ల ఆశ్చర్యచకితులవుతున్నారు. రాజకీయం అంటే జవాబుదారీ తనం. ఇదీ జనసేనాని తాజాగా బీ-ఫామ్స్ ఇస్తూ అభ్యర్థులకు గుర్తు చేసిన వైనం.
రాజకీయమంటే వ్యాపారం అయిపోయింది కొందరికి.! కానీ, రాజకీయమంటే బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు.! అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి, ప్రతి విషయంలోనూ అత్యంత వ్యూహాత్మకంగా జనసేనాని అడుగులేస్తున్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా జనసేనాని చేస్తున్న ఈ రాజకీయ యజ్ఞం సత్ఫలితాన్నిస్తుందా.? వేచి చూడాల్సిందే.