‘ఏదైనా ఉంటే నాతో చూసుకోవాలి గానీ ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగడం ఏంటి?బాధేస్తుంది’ ఈ మాట అన్నది ఎవరో తెలుసా సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆశ్చర్యంగా ఉందా కావాలంటే ఈ కింది ట్వీట్ చదవండి. 2018 లో ఓ మీడియాలో తన భార్య భారతి గురించి ఏదో తప్పుగా రాసారంట. అది కచ్చితంగా రాజకీయ కక్షే అంటూ రాజకీయాల్లోకి ఆడవాళ్లను లాగడం ఏంటని తెగ బాధ పడిపోతూ ట్వీట్ చేశారు. మరి గత కొంతకాలంగా ఆయన చేస్తుంది ఏంటి?. గత రెండేళ్లుగా అది ఎలాంటి సమావేశమైనా, సభ అయినా పరిస్థితులతో సంబంధం లేకుండా పదేపదే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. పవన్ పై శృతిమించిన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కార్లని మార్చినట్లు భార్యలను మారుస్తున్నారంటూ ఆయన స్థాయిని, హోదాని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. మరి ఇప్పుడు ఆయన చేసింది ఏంటి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలి?. తమది మహిళ ప్రభుత్వం అని పదేపదే డప్పు కొట్టుకునే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు విచక్షణ కోల్పోతున్నారు? అంటే సీఎం స్థాయిలో ఉంటే ఏం మాట్లాడినా చెల్లుతుందా?.
ఈ ఏడాది జూలై లో వెంకటగిరి వేదికగా జరిగిన ‘నేతన్న నేస్తం’ నిధుల విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. నాలుగేళ్లకోసారి భార్యని మార్చే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలోనూ పవన్ వ్యక్తిగత జీవితం పై మరోసారి శృతిమించి మాట్లాడారు. ఆయన్ని మ్యారేజ్ స్టార్ అని సంబోధిస్తూ మాట్లాడటం వివాదానికి దారితీసింది. అసలు విద్యార్థుల మధ్య మాట్లాడాల్సిన మాటలేనా అవి. ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పేరు పేపర్లో రాయడం తప్పు. రాజకీయ కక్ష. జగన్ మాత్రం ఎక్కడపడితే అక్కడ హద్దులు లేకుండా మాట్లాడటం హుందాతనం. అంతేలే అసెంబ్లీ సాక్షిగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బూతులు మాట్లాడుతున్నా కనీసం వారించలేని వ్యక్తి నుంచి అంతకంటే ఏం ఆశిస్తాం.