వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాలే.!
2019 ఎన్నికల సమయంలో వైసీపీ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసింది. అప్పట్లో చాలామంది టీడీపీ, జనసేన అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. క్యాడర్ కూడా అలాగే ఆందోళన చెందింది. ఈ గందరగోళం, వైసీపీకి అప్పట్లో బాగా కలిసొచ్చింది.
ఇప్పుడు ఈ తరహా ప్రచారం వైసీపీ కొంప ముంచుతోంది. పిఠాపురం (అసెంబ్లీ) వైసీపీ అబ్యర్థి, కాకినాడ ఎంపీ వంగా గీత, జనసేనలోకి వెళతారన్న ప్రచారం ఈనాటిది కాదు. కాకినాడ ఎంపీ టిక్కెట్ రెండో సారి ఆమెకు కేటాయించకపోవడంతో, ఆమె పార్టీ మారుతున్నారని గతంలోనే పుకార్లు షికార్లు చేశాయి.
వాస్తవానికి, వంగా గీత అనుచరులే, ఈ లీకులకు ఆస్కారమిచ్చారు. పార్టీ అధినాయకత్వం బుజ్జగింపులతో వంగా గీత మెత్తబడ్డారు, వైసీపీలోనే కొనసాగారు. అయితే, పిఠాపురంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వంగా గీత ఒకింత అయోమయంలో పడ్డారన్నది నిర్వివాదాంశం.
జనాల్లోకి వెళితే, ‘మా ఓటు జనసేనాని పవన్ కళ్యాణ్కే’ అన్న సమాధానం వస్తోంది వంగా గీతకి. దాంతో, వంగా గీత ఒకింత నొచ్చుకుంటున్నారు. ‘నేను లోకల్’ అని వంగా గీత చెబుతున్నారుగానీ, ‘ఐదేళ్ళు ఎంపీగా వుండి ఏం చేశావ్.?’ అని వంగా గీతని పిఠాపురం ‘లోకల్’ జనాలు నిలదీస్తున్నారాయె.
వైసీపీ అధినాయకత్వం ముందుగా హామీ ఇచ్చినట్లుగా మిధున్ రెడ్డి కావొచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావొచ్చు.. వీళ్ళెవరూ, పిఠాపురంలో తనకు మద్దతుగా వుండటంలేదని వంగా గీత అంతర్మధనం చెందుతున్నారు. వంగా గీత అనుచరగణం ఈ విషయమై బాహాటంగానే గుస్సా అవుతున్నారట.
‘జనసేనలోకి వెళ్ళిపోతున్నాం..’ అంటూ వంగా గీత అనుచరగణం, లీకులు ఇస్తోంటే, దానికి జనసేన ఒకింత అదనపు ఎలివేషన్ ఇస్తోందంతే.! ఈ లీకుల్ని బ్లాక్మెయిల్గా వైసీపీ అధినాయకత్వం భావిస్తోందిట. దాంతో, వంగా గీతకు క్రమంగా సపోర్ట్ తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.
జనసేనలోకి వెళ్ళే ఉద్దేశ్యం వంగా గీతకు లేకపోయినా, పరిస్థితులు ఆమెను జనసేన వైపుగా నడిపించే అవకాశాలైతే బాగానే కనిపిస్తున్నాయ్. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఒకవేళ వంగా గీత గనుక, పార్టీ మారితే.. అదీ, ఎన్నికల ముందర ఆమె కీలక నిర్ణయం తీసుకుంటే.. వైసీపీకి అది చావు దెబ్బ అవుతుందన్నది నిర్వివాదాంశం.
వంగా గీత మాత్రమే కాదు, చలమలశెట్టి సునీల్ విషయంలోనూ అదే జరుగుతోంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీలో వున్న చలమలశెట్టి సునీల్, తనకు ఏమాత్రం సానుకూల పరిస్థితులు లేవని భావించి, ఎన్నికల ప్రచారంలో ఖర్చుని బాగా తగ్గించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్.. నాలుగోసారీ ఓటమికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఓడిపోవడం కంటే, ముందే హుందాగా పోటీ నుంచి తప్పుకోవడం బెటరని చలమలశెట్టి సునీల్ కూడా భావిస్తారా.?