‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి చెందిన కొందరు అభ్యర్థులు, ‘అబ్బే, మేం వైసీపీలో వుండం..’ అని చెబుతుండడం వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అయితే, మీడియాకి ఈ వివరాలు చిక్కకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఆయా అభ్యర్థులు. మీడియాని దూరంగా వుంచి, తమ అనుచరులతో ఈ మాటల్ని ఓటర్లకు చెప్పిస్తున్నారు వైసీపీ అభ్యర్థులు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లోనూ, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
ఎందుకీ పరిస్థితి.? వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేత, ఉత్తరాంద్రపై పట్టున్న నాయకుడు.. ‘ఎన్నికల తర్వాత ఈ పార్టీలో వుండను..’ అని చెబుతున్న వైనం, అధినాయకత్వం దృష్టికి వెళ్ళింది. కొద్ది రోజుల క్రితమే, సదరు సీనియర్ నేత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ‘అత్యంత ఆప్తుడు’ అని సెలవిచ్చారు.
2019 ఎన్నికల్లో, ‘నాకూ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే. ఈసారికి నన్ను గెలిపించండి. లేకపోతే, నాకు చావే గతి..’ అని పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అడుక్కున్న ఓ వైసీపీ నేత, గెలిచాక, పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో చూశాం. అలా నోటి దురద చూపించినందుకుగాను, ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది.
ఆయనే, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడట. ఆయన కూడా పార్టీ మారతానని చెబుతున్నాడంటూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. కుల సంఘాల మీటింగుల్లోనూ, ఇతరత్రా క్లోజ్డ్ డోర్స్ మీటింగుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యల్ని పలువురు వైసీపీ అభ్యర్థులు చేస్తున్నారు.
ఓటమి భయంతో పోటీకి దూరమై, తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఓ వైసీపీ నేత కూడా, ఇదే తరహాలో కుల సంఘం సమావేశంలో వాపోయాడట. మొత్తంగా ఓ పది నుంచి పదిహేను మంది వైసీపీ అభ్యర్థులు (అసెంబ్లీ, లోక్ సభ) ఇలా, ‘గెలిచాక పార్టీ మారతాం..’ అని చెబుతుండడం వైసీపీ అధినాయకత్వం దృష్టికి కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.