వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంటుందని, వైసీపీ అభిమానులు తెగ ఆశలు పెట్టేసుకున్నారు. నవరత్నాలు ప్లస్.. అంటూ జరిగిన ప్రచారం, అది ప్రకటితమవగానే తుస్సుమంది.!
అమ్మ ఒడి కింద లబ్దిదారులకు ఇచ్చే మొత్తాన్ని 15 వేల రూపాయల నుంచి 17 వేల రూపాయలకు పెంచడం, రైతులకు ఏటా ఇచ్చే 13,500 రూపాయల్ని 16 వేల 500 రూపాయలకు పెంచడం మినహా.. కొత్తగా ‘నవరత్నాలు ప్లస్’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో ఇంకే ఆసక్తికర అంశాలూ లేవు.
అమ్మ ఒడి విషయానికి వస్తే, కటింగులు పోను, లబ్దిదారుల చేతికి 12 నుంచి 13 వేల రూపాయలు మాత్రమే వెళుతున్నాయి. 17 వేలకు పెంచిన దరిమిలా, ‘కటింగ్’ ఎంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. లబ్దిదారులకు పది వేలు అయినా వస్తుందా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయినా, వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. సో, ఈ మేనిఫెస్టోని చెత్త బుట్టలో పడెయ్యడమే. అన్నట్టు, సామాజిక పెన్షన్లను క్రమంగా 3 వేల నుంచి 3500 రూపాయలకు పెంచుతారట. ఇది ఇంకో ఫన్నింగ్ అంశం మేనిఫెస్టోలో పొందు పరచబడింది.
తాము అధికారంలోకి వస్తే, సామాజిక పెన్షన్లను 4 వేలకు పెంచుతామనీ, అది ఈ ఏప్రిల్ నుంచే అమలయ్యేలా, అధికారంలోకి వచ్చాక.. ఈ మొత్తాన్ని కూడా కలిపి ఇస్తామని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దాంతో, వైసీపీ మేనిఫెస్టో మైనస్ లా మిగిలిపోయింది.
అసలంటూ వైసీపీ క్యాడర్లోనే ఈ మేనిఫెస్టోపై పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. ‘అబద్ధపు హామీలు ఇవ్వలేదు’ అంటూ కలరింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు కొందరు, ఈ అర్థం పర్థం లేని మేనిఫెస్టోని చూశాక కూడా.
ఆసక్తికరమైన విషయమేంటంటే, గులక రాయి దెబ్బ తర్వాత, ఇన్ని రోజులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నుదుటన వున్న బ్యాండేజీని తొలగించారు. పెద్ద పెద్ద సర్జరీలు జరిగితేనే, రెండు మూడ్రోజులకి బ్యాండేజీ తొలగిస్తుంటారు. అలాంటిది, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చాలా రోజులపాటు చిన్న బ్యాండేజీని అలాగే వుంచుతూ వచ్చారు.
‘అది తొలగించకపోతే చీము పడుతుంది..’ అని సోదరి డాక్టర్ సునీతా రెడ్డి చేసిన సూచనతో, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాస్త భయం వేసి, బ్యాండ్ ఎయిడ్ తొలగించారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
కాగా, ‘అబద్ధపు హామీలు ఇవ్వం..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారుగానీ, గత మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం, సీపీఎస్ రద్దు వంటి అంశాలు వైసీపీ పాలనలో కార్యరూపం దాల్చలేదు. పోలవరం ప్రాజెక్టూ పూర్తి కాలేదు. ప్రత్యేక హోదా కూడా సాధించలేకపోయింది వైసీపీ.!