దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ రాయలసీమలో వినిపిస్తోంది.
రాయలసీమలో వైసీపీకి మంచి పట్టున్నమాట వాస్తవం.! రాయలసీమేతర ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం పూర్తిగా కూటమికే మొగ్గు కనిపిస్తోంది. కానీ, రాయలసీమలో, ‘నవరత్నాలు ప్లస్’ మేనిఫెస్టో తర్వాత, ఈక్వేషన్ అనూహ్యంగా మారిపోయింది.
సీపీఎస్ రద్దు వ్యవహారం, ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. మద్య నిషేధంపై మాట తప్పిన వైనం కూడా వైసీపీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపించనుంది.
ఇవన్నీ ఓ యెత్తు, పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావిస్తుండడాన్ని, సీమలో పెద్దగా ఎవరూ హర్షించడంలేదు. ‘సీమలో, ఆడాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళని ఏమంటారో తెలుసా.?’ అంటూ ఓ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘అదీ నిజమే కదా..’ అంటూ రాయలసీమ పల్లెల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు, విజయమ్మ ప్రస్తుతం విదేశాలకు వెళ్ళిపోవడం, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగడం, వివేకా హత్య కేసు విషయమై సునీతా రెడ్డి న్యాయ పోరాటం చేస్తుండడం.. ఇవన్నీ మహిళా ఓటర్లలో వైసీపీ పట్ల ఒకింత నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.
వైసీపీకి రాయలసీమలో పెరుగుతున్న నెగెటివ్ ఓటింగ్, ఖచ్చితంగా కూటమికి అనుకూలంగానే మారుతుందన్నది నిర్వివాదాంశం. నాలుగైదు స్థానాల్లో త్రిముఖ పోటీ వుంటుందనీ, అక్కడ ఎన్డీయే అభ్యర్థులకు ఎడ్జ్ వుంటుందనీ, మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మహిళా ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా నిలబడే అవకాశం వుందనీ అంటున్నారు.
అమ్మ ఒడి విషయమై గతంలో రెండు వేలు కట్ చేయడం, మహిళా ఓటర్లకు అస్సలు మింగుడుపడ్డంలేదు. ఆ రెండు వేలు పెంచుతామని కొత్త మేనిఫెస్టోలో పెట్టినా, అందులోంచి ఎంత కట్ చేస్తారోననే ఆందోళన సహజంగానే వుంటుంది. మేనిఫెస్టో తర్వాత, వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డ మాట వాస్తవమేనని, కడప జిల్లాకి చెందిన ఒకరిద్దరు వైసీపీ అభ్యర్థులు మీడియాకి లీకులు ఇస్తుండడం కొసమెరుపు.