Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో మరీ సుస్పష్టం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవిని ఎప్పటి లానే ఈసారి కూడా అదే గాటన కడుతున్నాయి పార్టీలు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చిరంజీవి స్వయానా అన్నయ్య. ఇటివలే తమ్ముడి విజయాన్ని కాంక్షిస్తూ పార్టీకి రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. ప్రజలకు మేలు చేస్తారని భావించి కొందరికి వీడియో ప్రచారం కూడా చేశారు చిరంజీవి. ఇది ఆయన వ్యక్తిగతం. కానీ.. కొందరు పనిగట్టుకుని చిరంజీవిని ఆయన ప్రమేయం లేకుండానే రాజకీయాలకు ముడిపెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకూ సమంజసమనేదే ప్రశ్న.
చిరంజీవి ప్రస్తావనే ఎందుకు..?
చిరంజీవి రాజకీయ ప్రయాణం ఇక్కడ అప్రస్తుతం. రాజకీయాలకు దూరంగా ఆయనో సినిమా స్టార్. సినీ ఎవరెస్టు శిఖరంపై దశాబ్దాలుగా జెండాపాతి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఆయన స్థానం.. స్థాయి వేరు. ఆయన పెద్దరికం వేరు. రాజకీయాలపై స్పందించినా స్పందించకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఆయన చేసే ప్రజా సేవ చాలు.. ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని చెప్పేందుకు. మరి.. ఇప్పుడెందుకు ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. కేవలం ఒక వీడియోలో నేతలను సమర్ధించి పార్టీలపై మాట్లాడితే.. ఆయన్ను రాజకీయాలకు ఆపాదించవచ్చా..?
కొందరు ఇదే పనిలో ఉంటున్నారు.
అంతవరకూ వస్తే..
ప్రస్తుతం చిరంజీవి విదేశాల్లో ఉన్నారు. అయినా.. ఇదిగో చిరంజీవి వచ్చేస్తున్నారు.. అదిగో చిరంజీవి వచ్చేస్తున్నారు. మే 5నుంచి 11వరకూ ప్రచారం చేస్తారని కొందరు మైకుల ముందు చెప్పేస్తున్నారు.. వారి ఆశ అలాంటిది మరి.
చిరంజీవి ప్రచారానికి వస్తున్నారని జనసేన అధికారిక సమాచారం ఇవ్వాలి.. లేదా పిఠాపురం వస్తున్నా అని చిరంజీవి చెప్పాలి. ఏదీ లేదు.
పార్టీ ఏదైనా ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం రావాలి అని మెగాస్టార్ చెబుతూనే ఉన్నారు.. అదే మంచి కోసం.. ముందుకు రావాలంటే.. చిరంజీవే ఆలస్యం చేయరు.