Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) . పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం చేరుకున్న ఆయనకు జనసేనతోపాటు కూటమి అభ్యర్ధులు ఘన స్వాగతం పలికారు.
నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తి కొడవలి, చెందుర్తి గ్రామాల్లో జరిగిన బైక్ ర్యాలీ, రోడ్ షోల్లో పాల్గొన్నారు. అంతకుముందు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ‘బాబాయి పవన్ కల్యాణ్ కు ప్రజలే కుటుంబం. ప్రజలకు సేవా చేయాలనేదే ఆయన లక్ష్యం. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. గత ఎన్నికల్లో ఆయన పరాజయం పొందినా ప్రజల మధ్యే ఉన్నారు’.
‘కౌలు రైతులకు ఆర్ధిక సాయం చేసేందుకు అప్పులు కూడా చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో బాబాయిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. ప్రజలకే మేలు చేస్తారు. ఎన్డీయే కూటమిని గెలిపించండ’ని పిలుపునిచ్చారు.