Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జనసేన వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈక్రమంలోనే జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ‘గ్లాస్ గుర్తు’ మరెవరికి కేటాయించే అవకాశంలేదని కూడా స్పష్టం చేసింది.
గతంలో గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ కేటగిరీలో చేరుస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తాము పోటీ చేయని నియోజకవర్గాల్లో కూడా గ్లాసు గుర్తును జనసేనకు మాత్రమే కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు స్పష్టత కోరుతూ జనసేన లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.