మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సెంట్రల్ జైల్ అధికారులకు ఓ అరుదైన అభ్యర్థన అందింది. గ్వాలియర్ లోని శివపురి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తనకి పిల్లలు కావాలని.. జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తకి పెరోల్ ఇవ్వాలంటూ అభ్యర్థన చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
గ్వాలియర్ లోని శివపురి ప్రాంతానికి చెందిన ధారా సింగ్ జాదవ్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే దారా సింగ్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో అతడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు గ్వాలియర్ లోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే దారాసింగ్ భార్య తనకు పిల్లలు కావాలని తన భర్తని పెరోల్ పై విడుదల చేయాలంటూ కొద్దిరోజుల క్రితం జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఆ పిటిషన్ పై స్పందించిన జైలు అధికారులు.. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన వ్యక్తి రెండేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుంటే అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్ ఇచ్చే నియమం ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ తుది నిర్ణయం తీసుకుంటారని జైలు అధికారులు పేర్కొన్నారు.
గతంలోనూ రాజస్థాన్ కి చెందిన ఓ మహిళ ఇలాంటి అభ్యర్థన చేయగా.. అప్పట్లో రాజస్థాన్ కోర్ట్ అరుదైన తీర్పును వెలువరించింది. ఆమెకున్న హక్కులను అనుసరించి తన భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.