సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్లో ఈ ‘ఉచిత పత్రికా’ సిత్రాల గురించి జనంలో భలే ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతోందండోయ్.!
తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతున్నాయ్. కాకపోతే, ఇవి లోక్ సభ ఎన్నికలు మాత్రమే. వ్యవహారం చాలా చప్పగా వుంది.! గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో మాత్రం, సీమాంధ్ర ఓటర్లు కాస్త ఎక్కువ గనుక, ఏపీ రాజకీయాలతోపాటు తెలంగాణ రాజకీయాల గురించీ ఆ ఓటర్లు కాస్త గట్టిగానే చర్చించుకుంటున్నారు.
ఇదే, ఈ కోణంలోనే సాక్షి దిన పత్రికని జనాలకి అంటగట్టేందుకు సదరు యాజమాన్యం నానా తంటాలూ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఏజెంట్లకి టార్గెట్లు పెట్టేశారట. కనీసం నెల రోజులు అయినా, ట్రై చేయమంటూ ఇళ్ళ వద్దకు వచ్చి మరీ బతిమాలుకుంటున్నారు.
‘వద్దు మొర్రో..’ అంటోంటే, ‘టార్గెట్లు ఇచ్చారు సార్.. మేం కూడా బతకాలి కదా..’ అంటూ ఒకింత ఆవేదనా భరితంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి, పత్రికల్ని చదవడం అనేది చాలా చాలా తగ్గిపోయింది. డిజిటల్ ఎడిషన్లు అందుబాటులోకి వచ్చేశాక, పేపర్ చూడటం అనేది చాలా చాలా తగ్గిపోయినమాట వాస్తవం.
ఇరవై నాలుగ్గంటలూ న్యూస్ ఛానళ్ళ సోది వుండనే వుంది. దీనికి తోడు, యూ ట్యూబ్ ఛానళ్ళు ఎక్కువయ్యాయ్. ఎలా చూసినా, పత్రికలకు అసలు సీన్ లేకుండా పోయిన రోజులివి. పైగా, సాక్షి అంటే.. వైసీపీ సొంత పత్రిక గనుక, దానికి తెలంగాణలో ఆదరణ అస్సలు లేదు.
ఎన్నికల వేళ సాక్షి పత్రికని ఎలాగోలా జనంలోకి తీసుకెళితే, అందులోని వైసీపీ అనుకూల కథనాలతో ఒకరిద్దరు ఓటర్లు అయినా తమకు అనుకూలంగా మారతారేమోనని బహుశా వైసీపీ అధినాయకత్వం.. అదే, సాక్షి యాజమాన్యం అనుకుంటున్నట్టుంది.
అన్నట్టు, పోలింగ్ ముందర.. పత్రికల్లో కరెన్సీ నోట్లను పెట్టి, ఓటర్లను ప్రలోభ పెట్టే వైనం గత ఎన్నికల్లోనే ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.! దాదాపు అన్ని పత్రికలకీ ఈ జాడ్యం అంటుకుంది. కాకపోతే, సాక్షి ఒకింత ఎక్కువే పైత్యం ప్రదర్శించింది ఈ విషయంలో.