‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డికి.
‘పంచకర్ల రమేష్, సీఎం రమేష్.. ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతలోనే మీకు ఒళ్ళు మండిపోయిందా.? ఎవర్నీ ఎవరూ మెచ్చకోకూడదు.. మిమ్మల్ని తప్ప. ఇదే మీ ఆధిపత్య ధోరణి. మత్స్యకారుల మీద విరుచుకుపడతారు.. రజనీకాంత్ మీద మండిపడతారు.. చిరంజీవి మీద చిర్రుబుర్రులాడతారు.. ఇదే ఆధిపత్య ధోరణి అంటే..’ అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘సింహం సింగిల్గా వస్తుంది..’ లాంటి డైలాగులు సినిమాల్లో బావుంటాయ్. నేనేదో సినిమాలో డైలాగ్ చెప్పాను.. సింహం గురించి. నేనే నవ్వుకుంటాను అది విని. జనంతో చప్పట్లు కొట్టించుకోవడానికి చెప్పే డైలాగులు అవి.. సింగిల్ సింహం.. అంటూ పెద్ద మొటలొద్దు.. సింగిల్ సింహం కాదు.. రేబిస్ సోకిన కుక్క..’ అంటూ వైసీపీపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
‘తోడేళ్ళు, నక్కలు.. అన్నీ ఏకమై వస్తున్నాయ్.. సింహం సింగిల్గా వస్తుందని అంటున్నారు.. రేబిస్ సోకిన కుక్కని పట్టుకోవడానికి నాలుగు వైపుల నుంచీ వ్యూహం పన్నుతాం. ఇక్కడా అదే జరిగింది. వైసీపీ ప్రభుత్వం అంటే రేబిస్ సోకిన కుక్క. అన్నిటినీ కాటేస్తోంది. అందుకే, దాన్ని పట్టుకోవడానికి అందరం కలవక తప్పలేదు..’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.
‘మీలా రౌడీలా మాట్లాడాల్సి వస్తే.. మాట్లాడటానికి ఇబ్బంది లేదు నాకు. ప్రజల్ని పల్లకీ ఎక్కించడానికి రాజకీయం చేస్తున్నాం. దళితుల్ని, బీసీల్నీ, మత్స్యకారుల్నీ పల్లకీ ఎక్కించి మోసే బోయలం మేం..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
‘చిరంజీవి అంటే పద్మ విభూషణ్.. అంత గొప్ప వ్యక్తి మీద మాటలు తూలొద్దు..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్, సజ్జల రామకృష్ణా రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.