అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే ఫోకస్ పెట్టింది. వైసీపీకి చెందిన కీలక నేతలు, తమకు అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, అందరూ పిఠాపురం గురించే మాట్లాడుతున్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారన్నది వైసీపీ వాదన. పిఠాపురంలోనేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ విక్టరీ సాధిస్తారంటూ స్థానికంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారాయె.! మంత్రులు, ఇతర ముఖ్య నేతలంతా వైసీపీ తరఫున పిఠాపురంలోనే మోహరిస్తున్నారు. ఇదంతా దేనికి.? ఇంకెందుకు, పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం.
జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనగానే, వైసీపీలో అలజడి షురూ అయ్యింది. మండల స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలోనూ అనధికారికంగా ఇన్ఛార్జిల నియామకం జరుగుతోంది. వార్డుల వారీగా కూడా వైసీపీ ముఖ్య నేతలు పిఠాపురంలో మోహరించబోతున్నారంటే, ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.?
‘డబ్బు ఎంత ఖర్చయినా ఫర్లేదు.. వైసీపీ గెలవాల్సిందే..’ అనే పట్టుదలతో వైసీపీ అధినాయకత్వం వుందిట పిఠాపురంలో. ఇంత ఫోకస్ పిఠాపురంలో పెట్టాల్సిన అవసరం ఏముంది.? అంటే, ఏ రాజకీయ పార్టీకి అయినా ప్రతి నియోజకవర్గమూ ముఖ్యమే.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు.
పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళకూడదు.. ఇదీ వైసీపీ నినాదం. కానీ, మిగతా నియోజకవర్గాల సంగతేంటి.? పిఠాపురం మీదనే వైసీపీ పెడుతున్న అదనపు ఫోకస్, ఇతర నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నిలువ నీడ లేకుండా పోవడానికి కారణమవుతుందేమోనన్న చర్చ కూడా జరుగుతోంది.
ఔను మరి, పిఠాపురంలో గెలిచేందుకు వైసీపీ వేస్తున్న వెకిలి వేషాల గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. వై నాట్ 175 అనేది మేకపోతు గాంభీర్యమే.. వైసీపీ కేవలం పిఠాపురంకే పరిమితమవుతోంది.. అని జనం చెవులు కొరుక్కునే పరిస్థితి వచ్చేసింది.