అబ్బే, రాష్ట్రం ఏమైపోతోందన్న బెంగ ఎవరికీ లేదు. ఎందుకంటే, రాష్ట్రం ప్రధాన రాజకీయ పార్టీలకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది తప్ప, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎవరికీ ఎలాంటి చింతా లేదన్నది నిర్వివాదాంశం.
విపక్షాల సంగతి పక్కన పెడితే, అధికార వైసీపీకి చాలా చాలా బాధ్యత వుంటుంది. కానీ, ఆ బాధ్యతని వైసీపీ ఏనాడో విస్మరించింది. కొన్నాళ్ళ క్రితం విజయవాడ కేంద్రంగా, డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టాల్కమ్ పౌడర్ ముసుగులో పెద్దయెత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ చేయబడిన ఆ ఘటన అప్పట్లో పెను సంచలనం.
ఏమైంది ఆ డ్రగ్స్ కేసు.? అన్న చర్చ ఎవరికీ అనవసరం. అసలది ప్రజలకు సంబంధించిన విషయమే కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అసలే కాదు.! ఇలా తయారయ్యింది పరిస్థితి.
తాజాగా, విశాఖ పోర్టులో పెద్దయెత్తున డ్రగ్స్ సీజ్ చేయబడ్డాయి. 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ ముసుగులో పెద్దయెత్తున డ్రగ్స్ దిగుమతి చేయబడగా, వాటిని సీబీఐ అత్యంత చాకచక్యంగా పట్టుకుంది. ప్రచారంలో వున్న విషయాల్ని బట్టి చూస్తే, వేల కోట్లు కాదు, లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలవి.
లక్షల కోట్లంటే చిన్న విషయం కాదు కదా.? అదీ, ఆంధ్ర ప్రదేశ్కే చెందిన ఓ కంపెనీ దిగుమతి చేసుకున్న కంటెయినర్ ద్వారా వీటిని తీసుకురావడం గమనార్హం. సదరు కంపెనీ ప్రతినిథులు, ‘మాకేం తెలీదు’ అంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది గనుక, ఈ వ్యవహారంలో నిజా నిజాలు ఎలా నిగ్గు తేలతాయన్నది ఆసక్తికరంగా మారింది.
వైసీపీ దొంగల పనే ఇదంతా.. అంటోంది టీడీపీ. కాదు కాదు, టీడీపీ పనేనని అంటోంది వైసీపీ.! ఇంతకీ, లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారంతో ఎవరికి లింకులున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు వైసీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. వైసీపీ నేతగా చెలామణీ అవుతున్నారాయన.
కాదు కాదు, వైసీపీ నుంచి టీడీపీలోకి దూకిన లావు శ్రీకృష్ణదేవరాయలకు లింక్ వుందంటూ ఇంకో వాదన తెరపైకొచ్చింది. అదే నిజమనుకున్నా, ఆ శ్రీకృష్ణదేవరాయులు వైసీపీ ఎంపీనే కదా.? కానీ, ఆయనిప్పుడు టీడీపీలో వున్నారు.
ఏ పార్టీకి చెందిన వ్యక్తులకు దీనితో సంబంధం వుందన్నది వేరే చర్చ. రాష్ట్రంలోకి పెద్దయెత్తున డ్రగ్స్ వచ్చి పడుతుండడం అత్యంత ప్రమాదకరం. దీనికి ముగింపు పలకాల్సి వుంది. ఓ కోడి కత్తి కేసు.. ఓ వివేకా హత్య కేసులా కాకుండా.. ఈ డ్రగ్స్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలతాయని ఆశిద్దాం.