ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా సంస్థకి చెందిన విద్యార్థుల రూపంలో.!
తూర్పు గోదావరి (ఉమ్మడి) జిల్లాలో వైఎస్ జగన్ బస్సు యాత్రకు జన సమీకరణ కనాకష్టంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎలాగోలా జనాన్ని సమీకరించేందుకు స్థానిక వైసీపీ నేతలు నానా తంటాలూ పడుతున్నారు. ఇంకోపక్క, ప్రజా వ్యతిరేకతను ఎక్కడికక్కడ టేస్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి.
ఓ విద్యా సంస్థకు సమీపంలోకి వైఎస్ జగన్ బస్సు యాత్ర చేరుకోగా, అక్కడి విద్యార్థులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినదించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అటెండెన్స్ తప్పనిసరి.. అంటూ సదరు విద్యా సంస్థ, బలవంతంగా విద్యార్థుల్ని రప్పించి, జగన్ బస్సు యాత్రకు జన సమీకరణ తరహాలో పోగేసేందుకు ప్రయత్నించింది. కాలేజీ యాజమాన్యానికి ముందే అందిన ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది. యాజమాన్యానికి చెందిన వారితో ముఖ్యమంత్రి బస్సు యాత్ర సందర్భంగా మంతనాలు కూడా జరిపారట.
అయితే, విద్యార్థులు మాత్రం, యాజమాన్యం తీరుతో విసిగిపోయారు. ముఖ్యమంత్రి బస్సు యాత్ర పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన బస్సు యాత్రలో తామెందుకు పాల్గొనాలంటూ మండిపడ్డారు.
పలితంగా, విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అనుకూలంగా విద్యార్థులు నినదించారు. దాంతో, ముఖ్యమంత్రి షాక్ అయ్యారు, కాలేజీ యాజమాన్యంపై గుస్సా అయ్యారు.
దాంతో, స్వామి భక్తి ప్రదర్శించిన కాలేజీ యాజమాన్యం, కొందరు విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలివ్వడం గమనార్హం. కాగా, బాధిత విద్యార్థులకు అండగా జనసేన నేతలు న్యాయ సహాయం అందించడానికి సిద్ధమయ్యారు.
విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.