ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో దక్కిన ఈ నియోజకవర్గంలో జనసేన ఎలాంటి వ్యూహాలతో ముందడుగు వేస్తోంది.?
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది ఈ నియోజకవర్గాన్ని. సిట్టింగ్ ఎమ్మెల్యేనే వైసీపీ ఈ నియోజకవర్గంలో కొనసాగిస్తోంది. 2019 ఎన్నికలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు వేరు. నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీకి జనసేన నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతోంది.
జనసేన నేత కందుల దుర్గేష్, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన వాస్తవానికి రాజమండ్రి నుంచి పోటీ చేయాల్సి వుండగా, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుంచి ఎదురైన తీవ్ర పోటీ నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా అవకాశం దక్కించుకోలేకపోయారు కందుల దుర్గేష్.
కందుల దుర్గేష్ రాజమండ్రి నుంచే పోటీ చేయాలని జనసేన శ్రేణులు తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. వయసు రీత్యా తనకే చివరి అవకాశం ఇవ్వాలని గోరంట్ల కోరడంతో, జనసేన ఆ సీటుని వదులుకుంది. అయితే, జనసేన పార్టీలో కందుల దుర్గేష్ కీలక నేత కావడంతో, ఆయన్ని నిడదవోలు నియోజకవర్గానికి పంపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
నిడదవోలు నియోజకవర్గాన్ని కన్ఫామ్ చేసుకున్నప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిన కందుల దుర్గేష్, క్రమంగా నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. నిడదవోలు జనసేన శ్రేణులు అలాగే టీడీపీ శ్రేణులు కూడా కందుల దుర్గేష్ ఇమేజ్ని నియోజకవర్గంలో అనూహ్యంగా పెంచాయి.
మరోపక్క, బీజేపీ నుంచి కూడా కందుల దుర్గేష్కి మద్దతు పెరిగింది. సామాజిక వర్గ సమీకరణాలు సహా అన్నీ కందుల దుర్గేష్కి కలిసొచ్చేలా వున్నాయి. జనసేనకు వైసీపీ నుంచి గట్టి పోటీ వున్నా, ఎడ్జ్ మాత్రం జనసేనకే కనిపిస్తోంది. కందుల దుర్గేష్ జోరు నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఒకింత డీలా పడినట్లే కనిపిస్తోందిక్కడ.