జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
అప్పుడప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఆవేశం కాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిన్న కూడా ఆ ఆవేశం కనిపించింది. ‘పవన్ కళ్యాణ్ ఇవే మాటల్ని కాస్త సంయమనంతో చెప్పొచ్చు కదా.?’ అన్న చర్చ మేధావి వర్గంలో జరుగుతోంది.
నిజమే, పవన్ కళ్యాణ్ కొంత సంయమనంతో మాట్లాడాల్సింది. కానీ, ఓ సుగాలి ప్రీతిని గుర్తు చేసుకున్నా, పదిహేనేళ్ళ అమర్నాథ్ అనే కుర్రాడ్ని గుర్తు చేసుకున్నా.. వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించగలిగితే, సంయమనం అసాధ్యం.
సుగాలి ప్రీతి ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై ఐదేళ్ళుగా వైసీపీ సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయింది. వైసీపీ హయాంలో వైసీపీ నాయకుడొకడు, అమర్నాథ్ అనే పదిహేనేళ్ళ కుర్రాడ్ని తగలబెట్టేశాడు. ప్రాణాలతో పోరాడుతూ అమర్నాథ్ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వుంది.
ఆ అమర్నాథ్ మాటలు వింటే, కాలిన గాయాలతో అతను మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తోంటే, ఎవరికైనా కడుపు రగిలిపోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మీద రాయి దాడి జరిగితే, తగిలిన చిన్న గాయానికే వైసీపీ నానా యాగీ చేస్తోంది. మరి, సుగాలి ప్రీతి కుటుంబం ఏం చేయాలి.? అమర్నాథ్ కుటుంబం ఏం చేయాలి.?
వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే, తన తండ్రి మరణం వెనుక కుట్ర ఏంటో తెలియాలని సునీతా రెడ్డి న్యాయ పోరాటం చెయ్యకూడదు.! ఇది వైసీపీ మార్కు రాజకీయం. ఆ కుటుంబానికే చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ ఇంటి ఆడబిడ్డేనన్న కనీస జాలి సునీతా రెడ్డి మీద చూపించలేకపోతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజల్ని తన కుటుంబంలా భావిస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయంపై గళం విప్పుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని, వైఎస్ జగన్ మీద సింపతీ కోసం వైసీపీ నానా పాట్లూ పడుతున్నట్లు కాదిక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహారం.!
పవన్ ఖళ్యాణ్ ఆవేదన, అమర్నాథ్ కుటుంబానికి అర్థమవుతోంది.. సుగాలి ప్రీతి కుటుంబానికీ అర్థమవుతోంది. తమ ఆవేదన, తమ ఆక్రందన, తమ ఘోష.. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ద్వారా బయటపడుతున్నాయన్నది ఆయా కుటుంబాలు చెబుతున్నమాట.