సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం సునీతా రెడ్డి చాలా పోరాటం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం, సునీతా రెడ్డిని వెంటేసుకుని వైఎస్ జగన్ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు.
మరి, అదే సునీతా రెడ్డి, ఇప్పుడు అదే సీబీఐ చెబుతున్న విషయాల్ని మీడియా ముందు వివరిస్తోంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ సోదరుడిలా ఆమెకు ఎందుకు అండదండలు అందించలేకపోతున్నారు.? అప్పట్లో సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక, సీబీఐ విచారణ వద్దని ఎందుకు అనాల్సి వచ్చింది.?
ఇవన్నీ ఓ యెత్తు.. అవినాష్ రెడ్డి మీద సునీతా రెడ్డి చేస్తున్న ఆరోపణల వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందన్నది కడప రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓ వైపు షర్మిలా రెడ్డి, ఇంకో వైపు సునీతా రెడ్డి.. రెండు వైపుల నుంచీ అవినాష్ రెడ్డికి వాయింపులు అయిపోతున్నాయ్.
తప్పనిసరి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. ‘చెల్లెళ్ళకు దిమ్మతిరిగే షాక్..’ అంటూ వైసీపీ అను‘కుల’ మీడియా ఎలివేషన్ ఇచ్చుకున్నా, అవినాష్ రెడ్డి వాదన వీగిపోయింది. అక్కడికేదో సునీతా రెడ్డి, ఆమె భర్తకే ఈ హత్యతో సంబంధం అన్నట్లు అవినాష్ రెడ్డి మొదటి నుంచీ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రమంతా చర్చించుకుంటోంది. చెల్లెళ్ళని రాజకీయంగా వాడుకుని, అవసరం తీరాక గెంటేశారనే విమర్శల్ని వైఎస్ జగన్ ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇక, అవినాష్ విషయానికొస్తే, కడపలో ఆయనకి ఓటమి తప్పేలా లేదు.! మహిళా లోకం పూర్తి వ్యతిరేకంగా వుందిప్పుడు అవినాష్ రెడ్డికి.