నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.. నియోజకవర్గంలో పరిస్థితులు అనూహ్యంగా మారాయి.
టీడీపీ – జనసేన మధ్య సయోధ్య అస్సలు వుండదని వైసీపీ భావించింది. సిట్టింగ్ ఎంపీ వంగా గీత, అసెంబ్లీకి పోటీ చేస్తుండడం తమకు కలిసొచ్చే అంశమని కూడా వైసీపీ లెక్కలేసుకుంది. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం సహా సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గంలో మోహరించారు.
మండలానికో ఇన్ఛార్జి.. కాదు కాదు, గ్రామానికో ఇన్ఛార్జి.. అన్నట్లుగా పిఠాపురంలో వైసీపీ హంగామా తొలుత కనిపించింది. జనసేన – టీడీపీ మధ్య టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కారణంగా మొదట్లో కొంత గందరగోళం వున్నా, క్రమంగా అన్ని పరిస్థితులూ చక్కబడ్డాయి.
పవన్ కళ్యాణ్ గెలుపుకి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాననీ, పవన్ కళ్యాణ్ గెలుపు తన గెలుపులా భావిస్తాననీ వర్మ ప్రకటించారు. అంతే కాదు, ఇంటింటికీ వర్మ తిరుగుతూ, పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురంలో ఇంటిని కూడా సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.
లోకల్ – నాన్ లోకల్ అన్న కోణంలో వైసీపీ ఎంతలా ఓటర్లను గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నా, లక్ష మెజార్టీకి తగ్గదంటూ ఓటర్లు తాము జనసేన వైపే వున్నామని తెగేసి చెబుతుండడం గమనార్హం.
తాజాగా, వైసీపీ అభ్యర్థి వంగా గీత తమ భూముల్ని ఆక్రమించుకున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. ఇవన్నీ పిఠాపురంలో వైసీపీకి షాకిచ్చే అంశాలే. అదే సమయంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కలిసొచ్చే అంశాలే.
మొదట్లో జోరుగా ఎన్నికల ప్రచారంలో కనిపించిన వంగా గీత, క్రమంగా వేగం తగ్గించారు. తన గెలుపుపై ఆమెలో అనుమానాలు పెరిగిపోయాయ్.. ఆశలూ సన్నగిల్లుతున్నాయి. కాపు సామాజిక వర్గ పెద్దల నుంచీ వంగా గీతపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది.