2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ రెండిటి గురించీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.
నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిత్వం బీజేపీ దక్కించుకోగా, అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీకి దక్కింది. జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన బొమ్మడి నాయకర్, వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు చేతిలో ఓడిపోయారు. అదీ స్వల్ప ఓట్ల తేడాతో.
బొమ్మడి నాయకర్ సుమారు 49 వేల ఓట్లు దక్కించుకోగా, ముదునూరి ప్రసాదరాజుకి సుమారు 55 వేల ఓట్లు దక్కాయి. టీడీపీ అభ్యర్థి బండారు మాధవ నాయుడు సుమారు 27 వేల ఓట్లు దక్కించుకున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఓట్లు సాధించింది.
కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. అప్పుడూ ఈ నియోజకవర్గం నుంచి ముదునూరి ప్రసాదరాజు గెలిచారు.. కాంగ్రెస్ అభ్యర్థిగా. 2014లో టీడీపీ అభ్యర్థి బండారు మాధవ నాయుడు విజయం సాధించారు. ఇదీ నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల వ్యవహారం.
ఈసారి పరిస్థితి ఎలా వుండబోతోంది.? జనసేన పార్టీకి ఈసారి టీడీపీ తోడయ్యింది. దానికి తోడు బీజేపీ ఓటింగ్ కూడా ఎంతో కొంత కలిసి రానుంది. స్థానికంగా బొమ్మడి నాయకర్కి మంచి ఫాలోయింగ్ వుంది. గడచిన ఐదేళ్ళలో ఆయన జనసేన నేతగా, జనంలోకి బలంగా వెళ్ళగలిగారు.
కాపు, క్షత్రియ సామాజిక వర్గాల్లోనూ బొమ్మడి నాయకర్ పట్ల సానుభూతి కనిపిస్తోంది, 2019 ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోయారన్న కారణంగా. జనసేన ఓంటరిగానే పోటీ చేస్తుందని తొలుత జరిగిన ప్రచారం సమయంలోనూ, బొమ్మడి నాయకర్ గెలిచేస్తారంటూ పలు సర్వేలు తేల్చడం గమనార్హం. టీడీపీ తోడయ్యింది గనుక, నాయకర్ మెజార్టీ పెరిగే అవకాశాలున్నాయి.
మొత్తంగా లక్షా అరవై ఎనిమిది వేల నూట ఇరవై మంది వరకు ఓటర్లున్నారు నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో. పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపు వెయ్యి వరకు ఎక్కువ వున్నారు ఈ నియోజకవర్గంలో. 60 వేల వరకు కాపు సామాజిక వర్గం ఓట్లు వుంటే, శెట్టిబలిజ ఓటర్లు దాదాపు 30 వేల వరకు వున్నారు.
మత్సకార ఓటర్లు 25 వేల వరకు వుంటారు ఈ నియోజకవర్గంలో. దళిత ఓటర్లు సుమారు 20 వేల వరకు వున్నారు ఈ నియోజకవర్గంలో. ముస్లిం మైనార్టీలు పది వేలు, వైశ్యులు నాలుగు వేలు, బ్రాహ్మణులు 3 వేలు, క్షత్రియులు 3 వేలు, కమ్మ అలాగే రెడ్డి మరియు ఇతర సామాజిక వర్గాల ఓటర్లు సుమారుగా 10 వేల వరకు వుంటారని అంచనా.
సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం చూసుకుంటే, కాపు అలాగే శెట్టిబలిజ, మత్స్యకార ఓటర్లు పూర్తిగా జనసేన వైపు నిలబడే అవకాశం వుంది. మిగతా సామాజిక వర్గాల్లోనూ జనసేన పట్ల పెరిగిన సానుకూలత, నర్సాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి బంపర్ మెజార్టీ తెచ్చిపెట్టడం ఖాయమని తెలుస్తోంది.
అధికార వైసీపీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లోనూ జనసేన గెలుపు ఖాయమని తేలుతుండడం గమనార్హం. అసలిక్కడ వైసీపీ అభ్యర్థి ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితే లేదనీ, అయితే ఆర్థికంగా మాత్రం వైసీపీ అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేసే పొజిషన్లో వున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆర్థికంగా వైసీపీ అభ్యర్థి ఎంత బలంగా వున్నా, బొమ్మడి నాయకర్ మెజార్టీ కాస్త తగ్గొచ్చేమోగానీ, ఆయన విజయాన్ని వైసీపీ అడ్డుకోవడం దాదాపు అసాధ్యమే.