ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభిస్తే, లక్ష మందిని కూడా పోగెయ్యలేకపోవడాన్ని ఏమనాలి.?
అధికారంలో వున్నప్పటి పరిస్థితులకీ, అధికారంలో వున్నా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పరిస్థితులకీ ఇదీ తేడా.! డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తరలించడానికి వీలు కుదరలేదు. ప్రైవేటు స్కూళ్ళకు సెలవులు ఇచ్చేసి, బస్సుల్ని లాక్కోవడానికీ వీలు కుదరలేదు. అక్కడికీ, మనిషికి వెయ్యి రూపాయలిచ్చి.. బిర్యానీ పెట్టి, లిక్కర్ పోసీ.. కొందర్ని తీసుకొచ్చారుగానీ, చాలా పలచగా కనిపించారు జనం ‘మేం సిద్ధం’ బస్సు యాత్రలో.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో ఇంత చప్పగా ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం కావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అన్నట్టు, ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభించే క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన వెంట ఆయన తల్లి వైఎస్ విజయమ్మ కనిపించడం గమనార్హం.
గత కొన్నాళ్ళుగా వైసీపీకి విజయమ్మ దూరంగా వుంటూ వస్తున్నారు. వైసీపీకి ఆమె ఏనాడో రాజీనామా చేశారు. వైసీపీకీ, వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికీ రాజీనామా చేశారు విజయమ్మ. కుమార్తె వెంట తెలంగాణలో రాజకీయం చేసిన విజయమ్మ, కుమార్తె షర్మిల తెలంగాణలో దుకాణాన్ని మూసేసి, కాంగ్రెస్ పార్టీలో చేరాక రాజకీయంగా మౌనం దాల్చారు.
వైఎస్ జగన్ మీద వైఎస్ షర్మిల నానా రకాల విమర్శలూ చేసినా, వైఎస్ విజయమ్మ ఏనాడూ మీడియా ముందుకు రాలేకపోయారు. మరి, ఇప్పుడెలా వచ్చారు.? బలవంతంగా ఆమెను తీసుకు వచ్చి వుంటారన్నది అంతటా వినిపిస్తోన్న అభిప్రాయం.
మొత్తమ్మీద, మేం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమే ఇంత చప్పగా సాగితే, ఎన్నికల ప్రచారంలో వైసీపీ శ్రేణులు ముందు ముందు ఇంకెంత డీలాపడతాయో ఏమో.!