జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం కంటే, ఆలోచనాత్మకమైన ట్వీట్ అనడం సబబేమో.!
ట్వీటులో ఎక్కడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శ చేయలేదు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా వైఫల్యాన్ని బాధ్యతగల రాజకీయ పార్టీ అధినేతగా జనసేనాని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
ఆ ట్వీటు సారాంశం ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు… చెట్లూ కొట్టలేదు.
ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి… ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే- గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి… ఇదీ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్.
షరామామూలుగానే వైసీపీ మద్దతుదారులు, బూతులతో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద. ఎందుకలా.? అంటే, కనీసపాటి అక్షర జ్ఞానం కూడా లేనోళ్ళనే వైసీపీ, సోషల్ మీడియాలో పెంచి పోషిస్తోంది మరి.!
వైఎస్ జగన్ అనే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా, ఆ దాడి విషయంలో భద్రతా వైఫల్యం సుస్పష్టం. డీజీపీ దగ్గర్నుంచి, పోలీసు శాఖకు సంబంధించిన కీలక అధికారులు ఈ దాడికి నైతిక బాధ్యత వహించి తీరాలి. ఎన్నికల సీజన్ గనుక, రాజకీయ ప్రముఖులు జనాల్లో వుంటారు. అలాంటివారికి భద్రత కల్పించలేని దుస్థితిలో పోలీసు శాఖ వుండడం అత్యంత దురదృష్టకరం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ…
— Pawan Kalyan (@PawanKalyan) April 15, 2024