విషయం ఏదైనా, పరిస్థితి ఏదైనా.. సర్వకాల, సర్వావస్థల్లోనూ చంద్రబాబు పేరెత్తినా, ఎత్తకున్నా ఆయనపై తీవ్ర విమర్శలు చేయడంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముందుంటారు. తాజాగా కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తున్న వేళ అందరూ కలిసి కట్టుగా పోరాడాల్సింది పోయి.. ఇప్పుడు కూడా అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్ సీపీ పరస్పర విమర్శలు సంధించుకుంటున్నాయి.
తాజాగా విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘సీఎం జగన్ చేతల మనిషి. ప్రచారానికి ఆయనెప్పుడూ దూరం. ఏదైనా టాస్క్ విజయవంతంమైతే క్రెడిట్ అధికారులకు ఇస్తారు. లోటుపాట్లుంటే ఆ బాధ్యత తనే తీసుకుంటారు. చంద్రబాబులా రోజుకు 16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి లేదిప్పుడు. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదు. తుఫాన్లు వస్తే మీడియా ఫోకస్ అంతా తనమీదే ఉండేలా డ్రామాలాడారు. పుష్కరాల్లో 30 మందిని పొట్టనపెట్టుకున్న వ్యక్తి విజనరీ ఎలా అవుతాడు? సీఎం జగన్ రూట్ మ్యాప్ ఇచ్చి అధికారులను పురమాయించారు. కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. పోలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే. హుదూద్, తిత్లీ తుఫాన్ల పరిహారం పేరుతో వందల కోట్లు పచ్చ నాయకులకు దోచిపెట్టాడు బాబు. భూములు లేనివారికి నష్టపరిహారం అందింది. నిజమైన బాధితులకు సీఎం జగన్ వచ్చాక న్యాయం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డెన్ చాన్స్ మిస్పయిందని ఏడుస్తున్నారు’ అని చంద్రబాబుపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
అయితే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అధికార, విపక్షాలు ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మానేసి.. కరోనా నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని పలువురు హితవు పలుకుతున్నారు.