నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి భంగపడ్డారు రఘురామకృష్ణరాజు.
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినా, అదే జిల్లాలోని ఉండి నియోజకవర్గాన్ని సాధించుకోవడంలో రఘురామకృష్ణరాజు వ్యూహం సఫలమయ్యింది. నామినేషన్ వేయడం మిగిలి వుంది ప్రస్తుతానికి. నామినేషన్ తర్వాత, ఎన్నికల ప్రచారానికి సంబంధించి రఘురామ వ్యూహాలు ఎలా వుండబోతున్నాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
బీజేపీ నుంచే కాదు, జనసేన నుంచి కూడా టిక్కెట్ కోసం రఘురామ తీవ్రంగానే ప్రయత్నించారు. ‘కూటమి నుంచే పోటీ చేస్తా..’ అని గతంలోనే ప్రకటించారు రఘురామ. అసలు ఉండి నియోజకవర్గాన్ని రఘురామ ఎందుకు ఎంచుకున్నారు.? అంటే, అది తప్ప వేరే ఆప్షన్ లేదాయె.
మరోపక్క, ఉండి విషయమై టీడీపీలో పెద్ద లొల్లే జరిగింది. కానీ, రఘురామ వైపే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మొగ్గు చూపారు. పోటీ చేయబోతున్నది ఉండి నియోజకవర్గంలోనే అయినా, మొత్తంగా నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కూటమి పార్టీలకు చెందిన నేతలందరితోనూ అన్ని వ్యవహారాలూ రఘురామ ముందే చక్కబెట్టేశారు.
‘అసెంబ్లీలో అధ్యక్షా.. అనాలి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు చూపించాలి..’ అనే ఏకైక పట్టుదలతో రఘురామకృష్ణరాజు పోటీకి దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. స్పీకర్ ఛెయిర్లో కూర్చుని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఆడుకోవాలని అనుకుంటున్నారట రఘురామ.
ఉండిలో గెలవడం రఘురామకి అంత తేలిక కాదు. టీడీపీ క్యాడర్ నుంచి కొంత ప్రతిఘటన తప్పకపోవచ్చు రఘురామకృష్ణరాజుకి. కానీ, తాను మంచి మెజార్టీతో ఉండి నుంచి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు.