వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తికరమే.
గతంలో వంగా గీత, ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత ఆమె. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుని, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు గనుక.. ఆయన మీద పోటీకి వంగా గీతను వైఎస్సార్సీపీ అధినాయకత్వం దింపింది.
అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పట్టేందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. పవన్ కళ్యాణ్, ఇంకా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించకపోయినా, ‘లక్ష మెజార్టీ’ అన్న వాదన, స్థానిక జనసేన శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రజల నుంచీ అదే రెస్పాన్స్ వస్తోంది.
ఇంతకీ, ఎంపీ వంగా గీత పరిస్థితి ఏంటి.? పిఠాపురం వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వంగా గీత ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొంటున్నారు.? అంటే, ఎక్కడికి వెళ్ళినా వంగా గీతకు నిలదీతలు ఎదురవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి చెందిన నాయకుడే. సిట్టింగ్ ఎంపీ వంగా గీత కూడా వైసీపీ నాయకురాలే.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ.. ఇద్దరూ కలిసి పిఠాపురంలో అభివృద్ధికి కృషి చేయలేదని జనం నిలదీస్తున్నారు. గుంతల రోడ్లు, తాగు నీటి సమస్య.. వంటి వాటి గురించి ఎంత మొత్తుకుంటున్నా అధికార వైసీపీ పట్టించుకోలేదనీ, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ అస్సలు తమను పట్టించుకోలేదని జనం వాపోతున్నారు.
‘నేను గెలిస్తే..’ అని వంగా గీత మాట్లాడేలోపు, ‘ఎంపీగానే పని చేస్తున్నారు కదా.? ఆ పదవిలో వుండి ఎందుకు చేయలేకపోయారు.?’ అని నిలదీస్తున్నారు జనం. అదీ, ఏకవచనంతో. దాంతో, వంగా గీత ఒకింత నొచ్చుకుంటున్నారు. రాయలసీమకి చెందిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కావొచ్చు, కాకినాడకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావొచ్చు.. చాలామంది నియోజకవర్గంలో వంగా గీతకు మద్దతుగా వ్యవహారాలు చక్కబెడుతున్నా, ఆమెకు అనుకూలంగా పరిస్థితులు అయితే మారడంలేదు.
‘నా నియోజకవర్గంలో ఇన్ని సమస్యలున్నాయా.?’ అని వంగా గీత సైతం ఆశ్చర్యపోతున్నా, పైకి ఎక్స్ప్రెషన్ తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీదా, సిట్టింగ్ ఎంపీ మీదా విపరీతమైన వ్యతిరేకత పిఠాపురంలో, కాకినాడ లోక్ సభ పరిధిలో కనిపిస్తోంది. వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వం మీదా వున్న ఇంతటి వ్యతిరేకత, పిఠాపురంలో కూటమికి కలిసొచ్చే అంశమే.
అందుకే, టిక్కెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మని తమవైపుకు తిప్పుకునేందుకు వైసీపీ నానా రకాల ప్రయత్నాలూ చేసి చతికిలపడింది. స్థానికంగా వైసీపీ పట్ల వున్న వ్యతిరేకత నేపథ్యంలో వర్మ కూడా జాగ్రత్తపడ్డారు. పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమనీ, ఆ గెలుపులో భాగం తీసుకునే అవకాశాన్ని తానెలా వదులుకుంటాననీ, సన్నిహితుల వద్ద చెబుతున్నారట వర్మ.
ఇదీ పిఠాపురంలో తాజా పరిస్థితి. ఎన్నికల్లోపు వైసీపీకి అనుకూలంగా ఎలాంటి అద్భుతాలూ జరిగే అవకాశం లేదు. మరింతగా వైసీపీ పరిస్థితి అక్కడ దిగజారిపోవచ్చు.