ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ పలు అనుమానాల్ని లేవనెత్తుతోంది.
ఈ విషయమై టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే, ఆ కంటెయినర్ కేవలం ‘ప్యాంట్రీ’ వాహనం అనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేం సిద్ధం’ బస్సు యాత్రకు సంబంధించి, భోజనావసరాలకు సంబంధించి ఈ ప్యాంట్రీ వాహనాన్ని రెడీ చేశారన్నది వైసీపీ వాదన.
కంటెయినర్.. ఈ మాట వింటే, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం ఉలిక్కి పడుతున్నారు. కారణం, 25 వేల కిలోల డ్రగ్స్ ఓ కంటెయినర్ ద్వారా బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకి చేరుకోవడమే. ఈ డ్రగ్స్ వ్యవహారంపై తొలుత ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. కానీ, అనూహ్యంగా ఆ రచ్చ చల్లారిపోయింది.
‘అందరూ దొంగలే.. అందరూ కలిసి పంచుకోవడానికి సిద్ధమైనట్టున్నారు.. అందుకే, అందరూ సైలెంటయిపోయారు..’ అన్న చర్చ, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ వేదికల వద్ద ప్రజల్లో జరుగుతోంది. ఈ సమయంలోనే, ముఖ్యమంత్రి ఇంట్లోకి కంటెయినర్.. అంశం తెరపైకొచ్చింది. దాంతో, సహజంగానే రాష్ట్రం ఉలిక్కిపడింది.
వాస్తవానికి అది కంటెయినర్ కాదు.. ఓ వ్యాన్. అది ప్యాంట్రీ వాహనంగా చెబుతూ వైసీపీ ఓ వీడియో కూడా విడుదల చేసింది. వీడియోలో అది ప్యాంట్రీ వాహనంగానే కనిపిస్తున్నప్పటికీ, అనుమానాలైతే అలాగే వున్నాయ్.
మూడు వేల కోట్ల రూపాయల నగదు, విలువైన వజ్రాలు, నగలు.. వీటన్నిటినీ కంటెయినర్గా చెప్పబడుతున్న సదరు ప్యాంట్రీ వాహనం ద్వారా మూడో కంటికి తెలియకుండా ఏదో పోర్టుకి తరలించారన్నది టీడీపీ ఆరోపణ. ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళిన ఆ వాహనానికి ‘పోలీస్ బోర్డ్’ పెట్టిన దరిమిలా, పోలీసు శాఖ ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇచ్చుకోవాల్సి వుంది.
ఇస్తుందా మరి.? పోలీసు శాఖ వివరణ ఇచ్చినాగానీ, ఈ వివాదం చల్లారుతుందా.? విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ తెరవకుండా వుండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నించారనీ, సీబీఐ ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిందనీ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.