Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం ( Coramandal Train Tragedy) ఘోర విషాదాన్ని నింపింది. కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఒకేసారి ఢీ కొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికే ఈ ఘటన లో 274 మంది మృతి చెందారు.
అయితే 14 ఏళ్ల క్రితం అంటే 2009 ఫిబ్రవరి 13న ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆరోజు కూడా శుక్రవారమే. ఆ ప్రమాదం కూడా రాత్రి 7:30 నుంచి 7:40 మధ్య జరిగింది. ఆ సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అత్యంత వేగంగా జైపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతుండగా పట్టాలు తప్పింది. దీంతో బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఇంజన్ భాగం బోగీలపై పడటంతో 16 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
నిన్న జరిగిన ప్రమాదంలో కొన్ని బోగీలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అందులో ఒక బోగి నేలలోకి కూరుకుపోవడంతో అక్కడ సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. అందులో మరింత మంది ప్రయాణికులు చిక్కుకొని ఉండొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని బోగీలు సురక్షితంగా ఉన్నాయి. ఒకసారిగా పెద్ద కుదుపు వచ్చి జనాల హాహాకారాలు వినిపించడంతో భయాందోళనకు గురయ్యామని, అయితే ఇంతటి విషాదం జరుగుతుందని అనుకోలేదని కోరమండల్ ఎక్స్ప్రెస్ లో సురక్షితంగా ఉన్న ప్రయాణికులు చెబుతున్నారు.