Ayodhya: మరికొన్ని గంటల్లో అయోధ్య (Ayodhya) లోని భవ్య మందిరంలో శ్రీరాముడు కొలువుదీరే శుభగడియల కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. కోట్లాది మంది హిందువుల శతాబ్దాలనాటి కల నెరవేరబోతోంది. ఈక్రమంలో ప్రతిఏటా శ్రీరామనవమి రోజున మూడో అంతస్తు నుంచి శ్రీరాముడి విగ్రహంపై మధ్యాహ్నం 12గంటల నుంచి ఆరు నిముషాలపాటు సూర్యకిరణాలు ప్రసరించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA)’ సాయంతో ‘సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది. ఇందుకు అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు రూపొందించారు.
వీటిని బెంగళూరులోని ‘ఆప్టిక్స్’ సంస్థ అందిస్తోంది. ఏటా శ్రీరామనవమికి సూర్యుడి సంచారం భిన్నంగా ఉంటుంది. దీంతో సూర్యకిరణాలు ప్రసరించడంలో మార్పులు ఉంటాయి. దీనికి IIA పరిష్కారం చూపింది. 19ఏళ్లకోసారి కలిసే సూర్య, చంద్ర రాశుల ఆధారంగా శ్రీరామనవమి రోజున సూర్యుడి గమనంలో వచ్చే మార్పుల ఆధారంగా సూర్యకిరణాలు శ్రీరాముడి నుదుటిపై ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. మూడో అంతస్తు పైనుంచి సూర్యకిరణాలు ప్రసరించాల్సి ఉన్నందున ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయ్యాక వీటిని ఆవిష్కరించనున్నారు.