వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త విమలా రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు వైసీపీకి దూరం కాకుండా వుండేందుకు నానా తంటాలూ పడుతున్నారు.
గతంలో, వైసీపీ తరఫున క్రిస్టియన్ ఓటు బ్యాంకుని ‘పదిలం’ చేసి పెట్టింది ఎవరో కాదు, ‘బ్రదర్’ అనిల్ కుమార్.. ఆయనెవరో తెలుసు కదా, వైఎస్ షర్మిల భర్త. కానీ, ఇప్పుడు అనిల్ కుమార్ వ్యవహారం వేరేలా వుంది. కాంగ్రెస్ పార్టీ వైపు, ఏపీలోని క్రిస్టియన్ ఓటు బ్యాంకుని తెరవెనుకాల ఆయన మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
నో డౌట్, వైసీపీకి క్రిస్టియన్ ఓటు బ్యాంకు గతంలో బాగా ఉపయోగపడింది. ఈసారి కూడా క్రిస్టియన్ ఓటు బ్యాంకులో మెజార్టీ జగన్ వైపే వుంటుందన్నది ఓ వాదన. కానీ, వైఎస్ షర్మిల వ్యూమం చూస్తోంటే, వైసీపీకి ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంకు నుంచి పది శాతం అయినా పడుతుందా.? అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది ఏ మతం.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. గతంలో ఈ విషయమై కొందరు కోర్టుకెక్కారు కూడా. ఆ వ్యవహారంలో ‘నా మతం ఇదీ’ అని వైఎస్ జగన్ చెప్పలేదు, చెప్పేదాకా పరిస్థితి రాలేదు కూడా.!
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై గడచిన ఐదేళ్ళలో చాలా చాలా దాడులు జరిగాయి. రాములోరి విగ్రహానికి శిరచ్ఛేదం కూడా చేశారు దుండగులు. హిందూ దేవతా విగ్రహాలకు అశుద్ధం పూయడంతోపాటు, రధాల్ని తగలబెట్టడం కూడా చేశాయి కొన్ని అసాంఘీక శక్తులు.
అంతర్వేదిలో రధం తగలబడితే, తేనె పట్టు కోసం ఆకతాయిలు చేసిన పని.. అని కట్టు కథ అల్లింది వైసీపీ సర్కారు. కొత్త రథం చేయించామంటూ ఆ తర్వాత పబ్లిసిటీ స్టంట్లు చేశారనుకోండి వైసీపీ నాయకులు.. అది వేరే సంగతి.
ఇప్పుడు వైఎస్ షర్మిల, ‘మనది క్రిస్టియన్ మతం’ అని అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్న దరిమిలా, క్రిస్టియన్ పాలనలో హిందూ దేవాలపై దాడులు సహజమే కదా.? అన్న చర్చ రాష్ట్రంలోని హిందూ ఓటర్లలో ఒకింత గట్టిగానే జరుగుతోంది.
ఓ వైపు క్రిస్టియన్ ఓటు బ్యాంకు గండి పడి, ఇంకో వైపు హిందూ ఓటు బ్యాంకు నుంచి వైసీపీ పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత కనిపిస్తే.. వైసీపీ పరిస్థితేంటి.? ఈ భయం ఇప్పుడు వైసీపీలో బయల్దేరింది. షర్మిలని కంట్రోల్ చేయడం వైసీపీకి చేతకావడంలేదు. కారణం, వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కట్టుకున్న పసుపు చీర మీద దిగజారుడు వ్యాఖ్యలు చేయడమే.
అయితే, వైఎస్ షర్మిలని నమ్మడానికి వీల్లేదు.. ఆమె వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రయత్నం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ, ఏది నిజం.?