ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
అధికార వైసీపీ నుంచి మంత్రి దాడిశెట్టి రాజా, ఇంకోసారి ఈ నియోజకవర్గంలో తనదే గెలుపన్న ధీమాతో వున్నారు. రాజకీయంగా యనమల కుటుంబానికి క్రమంగా ఈ నియోజకవర్గంలో పలుకుబడి తగ్గుతుండడమే అందుక్కారణం.
అయితే, యనమల రామకృష్ణుడు మీద పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, ఆయన సోదరుడు కృష్ణుడిపైన విపరీతమైన వ్యతిరేకత నియోజకవర్గంలో.. అందునా, తెలుగు తమ్ముళ్ళలో వుంది. అనూహ్యంగా ఆ యనమల కృష్ణుడు, టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో తునిలో రాజకీయ సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది.
అంతకు ముందు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి సీటు ఒకటి, కూటమికి సంకటంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీకి కేటాయించిన ఈ సీటు, తొలుత బీజేపీ నేతకు దక్కగా, టీడీపీ నేత నల్లమిల్లి పెద్ద యుద్దమే చేశారు. చివరికి ఆయన బీజేపీలోకి దూకేసి, ఆ సీటుని దక్కించుకున్నారు.
అటు అనపర్తి వివాదం సద్దుమణిగింది.. ఇప్పుడేమో, తునిలో కూటమికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనపర్తి ఎఫెక్ట్ రాజమండ్రి లోక్ సభ సీటు మీద వుంటే, తుని ఎఫెక్ట్ కాకినాడ లోక్ సభ సీటు మీద వుంటుంది. ఈ రెండు సీట్లలో కూటమికి తలనొప్పులు అనూహ్యంగా తగ్గిపోవడం గమనార్హం.
దాంతో, ఇప్పుడు వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, తునిలో గెలవడానికి శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనపర్తిపై వైసీపీ ఆశలు వదిలేసుకున్నట్టే. అనపర్తి సంగతెలా వున్నా, తునిలో అయితే, వైసీపీ ఊహించని షాక్ వైసీపీకి తగిలింది. కృష్ణుడిని తెచ్చుకుంటే కూటమికి నష్టమని వైసీపీ భావిస్తే, వైసీపీని ముంచేసింది ఇప్పుడా నిర్ణయం