ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా, రాజోలు అలాగే పి.గన్నవరం నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలవాలనీ, కూటమి అధికారంలోకి రావాలనీ ఆకాంక్షించారు.
వున్నపళంగా తన వ్యాఖ్యల్లోకి ‘ఉప్మా’ ప్రస్తావన తీసుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక్కడ ‘ఉప్మా’ ప్రస్తావన పవన్ కళ్యాణ్ తెచ్చింది, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురించేనా.? అన్న చర్చ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది.
నిజానికి, ముద్రగడ పద్మనాభంపై ఎవరూ ఎలాంటి విమర్శలూ చేయొద్దని గతంలో వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్, పార్టీ శ్రేణులకు సూచించారు. ‘పెద్దలు’ అంటూ ఇంకో సందర్భంలో ముద్రగడ పద్మనాభం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం చూశాం.
అయితే, వైసీపీలో చేరాక ముద్రగడ పద్మనాభం తీరు పూర్తిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకర పదజాలాన్ని సైతం ముద్రగడ పద్మనాభం వాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, ‘ఉప్మా’ ప్రస్తావన చేసి వుండొచ్చా.? అంటే, ఔననీ అనలేం.. కాదనీ అనలేం.
కాకపోతే, జనసైనికులు మాత్రం, ‘ఉప్మాకి అమ్ముడుపోయిన ముద్రగడ పద్మనాభం’ అంటూ సెటైర్లు వేయడం షురూ చేశారు. ‘పవన్ కళ్యాణ్ని నేనెందుకు వెళ్ళి కలవాలి.? ఆయనే రావాలి నా దగ్గరకి.. ఆయన స్థాయి ఏంటి.?’ అని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభం, ఇటీవల వైఎస్ జగన్, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తే, రోడ్డు మీద పడిగాపులు కాసిన సంగతి తెలిసిందే.
అందుకేనేమో, పవన్ కళ్యాణ్, ‘ఉప్మాకి అమ్ముడుపోవద్దు..’ అంటూ సెటైరేసింది.! సెటైర్ ఎవరిమీద అయినా, ఉప్మా సెటైర్ మాత్రం తగలాల్సిన వాళ్ళకి చాలా చాలా గట్టిగానే తగిలింది.