Ayodhya: అయోధ్య (Ayodhya) లో శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నింటా రామాలయాల్లో పూజలు, భక్తి పారాయణాలు జరుగుతున్నాయి. వాడవాడలా ప్రజలంతా జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవాన్ని ప్రపంచంలోని 60దేశాల్లో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో కార్ ర్యాలీ కూడా నిర్వహించారు. న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ వద్ద సంప్రదాయబద్ధంగా భజనలు, కీర్తనలు ఆలపిస్తూ ఉత్సవంగా నిర్వహిస్తున్నారు.
టైమ్ స్క్వేర్ వద్దకు ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో.. శ్రీరాముడి జెండాలతో హాజరయ్యారు. మసాచుసెట్స్ మేయర్ జో పెట్టీ సంబరాల్లో పాల్గొని హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి మధ్యాహ్నం 12.20గంటలకు ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 1గంట వరకూ ఈ కార్యక్రమం జరుగనుంది. న్యూయార్క్ లో లైవ్ ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. అయోధ్య మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. దేశ, విదేశాల నుంచి మొత్తం 7వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు.