Vyooham: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పై జారీ చేసిన సస్పెన్షన్ ను పొడిగించింది. మరో మూడు వారాలపాటు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వ్యూహం విడుదలకు బ్రేక్ పడినట్టయింది. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా సినిమాపై కొత్త సెన్సార్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలని ఆదేశించింది.
చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారని లోకేశ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ పైనే లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్.. సీబీఎఫ్ సీ జారీ చేసిన సర్టిఫికెట్ పై జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు ప్రస్తుత ఆదేశాలు జారీ చేసింది.