Cyclone Michaung: మిగ్ జాం తుపాను (Cyclone Michaung) తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దీంతో వాతావరణ శాఖ కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావంతో విశాఖ, గోదావరి జిల్లాలు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు బాపట్ల, కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. కాసేపట్లో తుపాను తీవ్ర తుపానుగా మారి నిజాంపట్నం వద్ద తీరం దాటనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం తుపాను కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతోంది. కాకినాడలోని ఉప్పాడ, బాపట్ల వద్ద సూర్యలంక ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్ర తీరం వెంబడి 1.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొన్ని గేట్లు మోరాయిస్తూండటంతో గేట్ల పైనుంచి వరద పొంగి ప్రవహిస్తోంది.