బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఓ భూవివాదంలో హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్ రావు, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ తోపాటు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిలు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో అఖిలను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
భార్గవరామ్ పరారీలో ఉండగా.. ఏవీ సుబ్బారెడ్డికి సీఆర్పీసీ 41 కింద నోటీసు ఇచ్చి వదిలేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం అఖిలప్రియ సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు విచారణ నిమిత్తం ఆమెను 7 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. వీటిపై కోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. అలాగే పోలీసుల వినతి మేరకు అఖిలను మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.