అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ ప్రచారం చేసింది. కొత్త రథాన్ని తయారు చేయించేసి, రథం తగలబడిన అంశాన్ని తెరమరుగు చేసేందుకు వైసీపీ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
హిందూ దేవాలయాల విషయమై వైసీపీ చిత్తశుద్ధి ఇదీ. రామతీర్థం కొండపై రాములోరి విగ్రహాన్ని దుండగులు నాశనం చేస్తే, తల తెగ నరికితే.. ఆ కేసులో దోషులెవరో ఇప్పటికీ తేలలేదు. దేవుడి వాహనం.. దేవుడి విగ్రహం.. వీటికే భద్రత లేని పరిస్థితి వైసీపీ హయాంలో. అలాంటిది, ఆ దేవుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చక స్వాములకు భద్రత ఎలా వుంటుంది.?
తాజాగా, కాకినాడ పరిధిలోని ఓ దేవాలయంలో అర్చక స్వాములపై వైసీపీ నేత ఒకరు దాడి చేశారు. అర్చన కార్యక్రమాలు తాము చెప్పినట్లు చేయలేదన్నది సదరు వైసీపీ నేత గుస్సాకి కారణమట. అర్చక స్వాములపై జరిగిన దాడితో అంతా విస్తుపోతున్నారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ.. కేవలం ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న గొడవ.. అంటూ అధికార వైసీపీ, ఈ ఘోరాన్ని లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. గొడ్డలి వేటుని, గుండె పోటుగా ఏమార్చడం వైసీపీకి కొత్త కాదు గనుక, ఈ తరహా ప్రయత్నాలు వైసీపీ నుంచి జరగడం మామూలే.
ఎక్కడన్నా ఏదన్నా దేవాలయానికి సంబంధించి ఉత్సవాలు జరిగితే, ఆ దేవాలయాన్ని వైసీపీ బ్యానర్లతో నింపెయ్యడం అనేది గత కొంతకాలంగా జరుగుతున్న వికృత రాజకీయ క్రీడ. హిందూ మత విశ్వాసాల్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా వైసీపీ చర్యలు కనిపిస్తున్నాయి. అందులో భాగమే, తాజాగా కాకినాడలో అర్చక స్వామిపై వైసీపీ నేతలు చేసిన దాడి.
వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలకీ, హిందూ దేవాలయాల్లోని దేవుళ్ళ విగ్రహాలకీ, రథాలకీ, ఆఖరికి.. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చక స్వాములకీ భద్రత లేకుండా పోతుండడం అత్యంత బాధాకరం.