నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’ అంటూ రఘురామకృష్ణరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
టీడీపీ ఎందుకు రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ ఇవ్వాలి.? ఆయనేమీ వైసీపీని వీడి, టీడీపీలో చేరలేదు కదా.? వైసీపీని రఘురామ వీడటం వెనుక టీడీపీ పాత్ర ఏమైనా వుందా.? టీడీపీ నుంచి అప్పట్లో రఘురామ ఏమైనా హామీ పొందారా.? ఇలా చాలా చాలా వాదనలు తెరపైకొస్తున్నాయి.
రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ ఇచ్చుకోలేకపోయిన టీడీపీ, రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తుందని జనం అనుకుంటారట. ఇదెక్కడి కామెడీ.? బీజేపీ కోటాలో రఘురామకి టీడీపీనే టిక్కెట్ ఇప్పించి వుండాల్సిందన్నది రఘురామకృష్ణరాజు ఉవాచ.
జేపీ నడ్డా తెలుసు.. అమిత్ షా తెలుసు.. ప్రధాని నరేంద్ర మోడీ నాకు బాగా తెలుసు.. ఇలా చెప్పుకున్నారు రఘురామకృష్ణరాజు. ఢిల్లీ వేదికగా రఘురామ అప్పట్లో చేసిన హంగామా గురించి కొత్తగా చెప్పేదేముంది.? అందుకే, రఘురామని టచ్ చేయడానికి నానా తంటాలూ పడి, చేసేది లేక చేతులు ముడుచుకు కూర్చంది వైసీపీ.. అనర్హత వేటు విషయమై.
కానీ, ఇప్పుడేంటి రఘురామ ఇలా ప్లేటు ఫిరాయించారు.? టీడీపీ చేతిలో ఏమీ లేదు.. రఘురామకి బీజేపీ నుంచి టిక్కెట్ ఇప్పించేంత సీన్ చంద్రబాబుకి అయితే లేదు. బీజేపీ నేతలకే టీడీపీ నుంచి టిక్కెట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుది.
నర్సాపురం ఎంపీ టిక్కెట్ కాకపోతే, భీమవరం అసెంబ్లీ టిక్కెట్ అయినా ఇవ్వాలని చంద్రబాబుపై రఘురామ ఒత్తిడి పెంచుతున్నారట. కానీ, భీమవరం ఆల్రెడీ జనసేన కోటాలోకి వెళ్ళిపోయింది. అభ్యర్థిని కూడా జనసేన ప్రకటించేసింది. ఇప్పుడు అది మార్చడం దాదాపుగా అసాధ్యం.
టీడీపీని కాకుండా జనసేనని రఘురామ కృష్ణరాజు గతంలో నమ్ముకుని వుంటే, నర్సాపురం లోక్ సభ టిక్కెట్ ఆయనకు జనసేన నుంచి దక్కి వుండేదన్నది రఘురామ అనుచరుల ఉవాచ. అయినా, ఇప్పుడు.. ఈ సమయంలో రఘురామ రివర్స్ గేర్ వేసి లాభం లేదు. ముందే, గట్టిగా ప్రయత్నించి వుంటే.. టిక్కెట్ దక్కి వుండేదే.
ఇప్పుడు రఘురామ ఈ హంగామా చేయడం వల్ల ఆయనే రాజకీయంగా పలచనైపోతారు. టీడీపీ దృష్టిలో అయినా, జనసేన దృష్టిలో అయినా, రఘురామ చులకనైపోతున్నారంటే, అది ఆయన చర్యల కారణంగానే. బీజేపీ ఎలాగూ ఆయన్ని లెక్క చేయదనుకోండి.. అది వేరే సంగతి.
వైసీపీ నుంచి అయితే రఘురామ మీద జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. టీడీపీ, జనసేన, బీజేపీ కాకపోతే.. రఘురామ కాంగ్రెస్ పంచన చేరతారా.? ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.