టీడీపీ – జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల సారాంశం. సరే, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ.. ఖచ్చితమైన వ్యూహాలతో ఎన్నికల్ని ఫేస్ చేయాలనుకుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
మొత్తంగా ఆరుగురు అభ్యర్థుల లిస్టుని బీజేపీ నిన్న ప్రకటించింది. వీటిల్లో పురంధరీశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయడమొక్కటీ బీజేపీకి కాస్త అడ్వాంటేజ్ అవ్వొచ్చు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ కూడా ఒకింత ఆసక్తికరమే. మిగతావేవీ అంత ఎఫెక్టివ్గా కనిపించడంలేదు.
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు బరిలోకి దిగడం ఆసక్తికర పరిణామం. ఈయన గతంలోనూ వైసీపీ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నించారాయన. కానీ, అనూహ్యంగా బీజేపీ నుంచి టిక్కెట్ దక్కించుకున్నారు.
నిజానికి, తిరుపతి జనసేన సీటు అనీ, జనసేనాని వ్యూహాత్మకంగా బీజేపీ నుంచి వరప్రసాద్ రావుని బరిలోకి దించుతున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
కాగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి లోక్ సభకు పోటీ చేస్తుండడం ఆసక్తికర పరిణామం. అయితే, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుపై చాలా అనుమానాలున్నాయ్. అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ నేత. ఆ తర్వాత ఆమె బీజేపీలోకి దూకారు. చాలాకాలంగా బీజేపీతోనే వున్నారామె. అరకు నియోజకవర్గంపై పట్టున్నా, ఆమెకి గెలుపు అంత తేలిక కాదు.
నర్సాపురం టిక్కెట్ రఘురామకృష్ణరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస్ రాజుకి బీజేపీ ఇవ్వడం ఒకింత ఆసక్తికరం. రఘురామకృష్ణరాజు అయితే ష్యూర్ షాట్ గెలిచే నియోజకవర్గమిది. లిస్ట్ మొత్తం చూస్తే, ఇదేదో వైసీపీకి అనుకూలంగా బీజేపీ మార్చిన గేమ్ ప్లాన్ అనే ఇంప్రెషన్ కలగడం సహజమే. కానీ, అంత తేలిగ్గా తీసి పారేసే అభ్యర్థులు కాదెవ్వరూ.? కూటమి వేవ్ కనిపిస్తే, ఆరూ గెలిచే సీట్లే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.!