YS Jagan: మూడు రాజధానుల వ్యవహారం గుర్తుంది కదా.? చేతిలో అధికారం వుందనే ధైర్యంతో మూడు రాజధానులపై బిల్లు పెట్టేసి, ‘సగం’ ఆమోదించేసుకుంది జగన్ సర్కారు.! అది ధైర్యం కాదు, అహంకారం.. అంటారు కొందరు.
కానీ, ఏమయ్యింది.? అసెంబ్లీలో పాసైన బిల్లు, శాసన మండలిలో ఆగిపోయింది. అయినాగానీ, ఏవో టెక్నికల్ రీజన్స్ చెప్పేసి, ‘బిల్లు పాస్’ అనిపించేశారు. చట్టమైపోతుందనుకుంటే, అది కాస్త చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే చట్టం చేశారో, వాళ్ళే దాన్ని.. అదే శాసన సభలో చింపెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
అయినాగానీ, ఆ మూడు రాజధానుల నాటకం కొనసాగుతూనే వుంది. పరిపాలనా రాజధాని అంటున్న విశాఖలో, రుషికొండకి గుండు కొట్టేయడం మినహా, అక్కడ రాజధానికి సంబంధించిన పనులేమీ చేయడంలేదు వైసీపీ సర్కారు.
శాసన రాజధాని.. అనే పేరు అమరావతికి పెట్టినా, దాన్ని స్మశానంగానూ.. ఎడారిగానూ.. ముంపు ప్రాంతంగానూ.. అన్నటికీ మించి కమ్మరావతిగానూ వైసీపీ భావిస్తోంది. ఇప్పుడు అదే స్మశానంలో.. అదే ఎడారిలో.. అదే ముంపు ప్రాంతంలో.. అదే కమ్మరావతిలో.. జగన్ సర్కారు చాలా చాలా పెద్ద మనసుతో, పేదలకు ‘సెంటు భూమి’ చొప్పున ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ళ పట్టాలు ఇచ్చేసింది.
ఈ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇళ్ళ స్థలాలు లబ్దిదారుల చేతికి అందడం అనేది, న్యాయస్థానాల తుది తీర్పు మీద ఆధారపడి వుంటుంది. అంటే, మూడు రాజధానుల బిల్లు లాగానే అన్నమాట. ఒకవేళ కోర్టులో ఇళ్ళ స్థలాల విషయమై ప్రభుత్వానికి షాక్ తగిలే పరిస్థితి వుంటే, మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో చింపేసినట్లు.. ఈ ఇళ్ళ పట్టాల్ని కూడా ప్రభుత్వమే చింపేస్తుందన్నమాట.
మరి, ఈ ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభ నిర్వహించారు కదా.? దానికి జవాబుదారీతనం ఎలా.?