YSRCP: రోజురోజుకీ వైసీపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంతమంది తిరిగి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి. ‘మేం, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాం.. మా వారసులకు టిక్కెట్లు ఇవ్వండి..’ అంటూ డజను మందికి పైగానే ఎమ్మెల్యేలు, నేరుగా విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరవేసేశారు.
‘ఈసారికి మీరే పోటీ చెయ్యండి.. తర్వాత సంగతి చూద్దాం..’ అని ముఖ్యమంత్రి బతిమాలుకుంటున్నారు ఆయా ఎమ్మెల్యేలని. అయినాగానీ, ‘ససేమిరా’ అంటున్నారు సదరు ఎమ్మెల్యేలు. ఇదీ వైసీపీలో వాస్తవ పరిస్థితి.
ఇంకోపక్క, ‘ఆయనకు టిక్కెట్లు ఇస్తే ఓడిస్తాం..’ అంటూ ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులే, తమ తమ ప్రజా ప్రతినిథులకు ఎదురుతిరుగుతున్నారు. ఇదో తలనొప్పి మళ్ళీ.! ఏం చేద్దాం.? అంటూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపట్టుక్కూర్చోవాల్సి వస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడుపై గెలిచి తీరతానంటున్నారు వచ్చే ఎన్నికల్లో. అయితే, అది నిన్నమొన్నటిదాకా నడిచిన వ్యవహారం. ‘నాకంటే మొనగాడు ఎవడున్నాడు.?’ అంటూ బూతులతో విరుచుకుపడిపోయే దువ్వాడ శ్రీనివాస్కి ‘తోక’ కత్తిరింపు జరిగిపోయింది.
దువ్వాడకు సీటిస్తే, ఓడిస్తాం.. అని వైసీపీ శ్రేణులే నినదించడంతో, ఆయనకు టిక్కెట్ లేదని తేల్చేశారు వైఎస్ జగన్. దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో ఆయన సతీమణికి టిక్కెట్ ఇస్తారట. అసలెందుకిలా జరుగుతోంది.?
వైనాట్ 175 సంగతి తర్వాత.. పోటీ చేయడానికి ఎంతమంది అభ్యర్థులు నిఖార్సుగా వైసీపీకి మిగులుతారో తెలియని పరిస్థితి.