TDP Manifesto: 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘పాక్షిక మేనిఫెస్టో’ని ప్రకటించేశారు. టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
ప్రకటనలో ముఖ్యమైన విషయాలేంటంటే, 18 ఏళ్ళు పైబడి 59 ఏళ్ళ మధ్య వున్న మహిళలందరికీ నెలకి 1500 రూపాయల చొప్పున, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు వేసేస్తారట.
అంతే కాదు, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డా చదువుకునేందుకోసం ఏటా 15 వేలు ఇస్తారట. ఇంట్లో ఇద్దరు పిల్లలు వుంటే, ఇద్దరు పిల్లలకీ ఈ పథకం వర్తిస్తుందట. అంతేనా.? ఇంకా వుంది. ఏడాదికి 3 సిలెండర్లను ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తారట. అక్కడితో ఆగలేదు, జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారట.
యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికీ నెలకు 3 వేల రూపాయల చొప్పున ఇస్తారట.! టీడీపీ అధికారంలోకి వస్తే, ఇన్ని లాభాలా.? అంతే మరి.! ఎన్నికల మేనిఫెస్టోలు అంటే అలాగే వుంటాయ్.! అన్నట్టు, రైతులకు ఏడాదికి 20 వేల రూపాయల సాయం అందిస్తారట టీడీపీ అధికారంలోకి వస్తే.
వారెవ్వా.! టీడీపీ పాక్షిక మేనిఫెస్టో అదిరిపోయింది. ఇంతకీ, ఈ పథకాల అమలు కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారు.? ఇంకెక్కడి నుంచి.. అప్పులు చేస్తారు.! ఆ అప్పుల భారం ఎవరు మోస్తారు.? ఇప్పుడు మోస్తున్న ప్రజలే, అప్పుడూ మోస్తారు.
అన్నట్టు, ఐదేళ్ళలో ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేస్తారట టీడీపీ అధికారంలోకి వస్తే. కథ అప్పుడే అయిపోలేదు.. ఇంకా వుంది.! పూర్తి మేనిఫెస్టోలో మరిన్ని కళ్ళు చెదిరే అంశాలుంటాయట.!