North Korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్( Kim jong un) వేసే శిక్షలు ఎంత అమానవీయంగా ఉంటాయో తెలిసిందే. తనకి ఎదురు తిరిగితే ఎంతటి వారినైనా కఠోరంగా శిక్షిస్తూ ఉంటాడు. కిమ్ రాజ్యంలో ఆకృత్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. క్రిస్టియన్స్ పై కిమ్ ప్రభుత్వం ఎప్పటినుంచో దారుణంగా ప్రవర్తిస్తోంది. ఆ వేదింపులపై అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల నివేదిక కూడా విడుదల చేసింది. బైబిల్ పట్టుకుని కొరియా వీధుల్లో తిరిగే క్రిస్టియన్స్ ని కఠినంగా శిక్షిస్తున్నారనేది నివేదిక సారాంశం. కొరియాలో నివసించే ఇతర మతాల ప్రజలపై కిమ్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. అందులోనూ క్రిస్టియన్స్ పై మరింత దారుణంగా ప్రవర్తిస్తోంది.
అలా 2009లో బైబిల్ పట్టుకుని కనిపించిన ఓ కుటుంబానికి అక్కడి ప్రభుత్వం కఠిన శిక్ష విధించింది. ఆ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారిని కూడా వదిలిపెట్టలేదు. వారందరికీ జీవిత ఖైదు విధించారు. అంతేకాకుండా మతపరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పొలిటికల్ జైల్ లో ఉంచి వారిని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. హత్యలు, హత్యాచారం, అవయవాల దోపిడి, గూడచర్యానికి పంపడం వంటి ఆకృత్యాలకు పాల్పడుతోందని ఆ నివేదిక లో వెల్లడైంది.