ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతులంతా దేవరకొండ మండలం చింతబావికి చెందిన వారు అని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద జరిగింది. మృతులంతా పిఏపల్లి మండలం రంగారెడ్డి గూడెం లో నాట్లు వేయడానికి వెళ్లి తిరిగి వస్తున్న కూలీలు.
లెక్కకు మించి ప్రయాణికులతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఆటో ఓవర్ టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ డీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ తో పాటు 5 గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ప్రాంతంలో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.