పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా, కాకినాడ ఎంపీ వంగా గీత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
అప్పుడే, మాటల యుద్ధం కూడా షురూ అయ్యింది. ఓటుకు లక్ష పంచైనా పిఠాపురం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రంగంలోకి దించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, వంగా గీత పట్ల పిఠాపురంలో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని, అనుకూలత కూడా ఆమె పట్ల ఆ నియోజకవర్గంలో లేని పరిస్థితి. కాపు వర్సెస్ కాపు.. ఇదీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ – వంగా గీత మధ్య జరగనున్న ఎన్నికల పోటీ.. అనేలా వైసీపీ ఓ ఇమేజ్ క్రియేట్ చేసింది.
అయితే, పిఠాపురం పొలిటికల్ ఈక్వేషన్ వేరు. కాపు సామాజిక వర్గం ఓట్లతోపాటుగా, ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా చైతన్యవంతమై వుంటాయి పిఠాపురం నియోజకవర్గంలో. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన దాఖలాలున్నాయి.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. అయినా, ఆయన గెలిచారు గతంలో. సో, ‘కాపు’ ఓటు బ్యాంకు చుట్టూ వైసీపీ రాజకీయం చేయడంలో అర్థమే లేదు.
ఇక, ఈ నియోజకవర్గంపై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెత్తనం ఏంటి.? అన్న చర్చ నియోజకవర్గ ప్రజల్లో జరుగుతోంది. ‘రాయలసీమ ఫ్యాక్షనిజం పిఠాపురంలో ప్రదర్శిస్తారా.?’ అంటూ వైసీపీ మీద స్థానిక ప్రజలు గుస్సా అవుతున్నారు. అది ఖచ్చితంగా వంగా గీతకు మైనస్ పాయింట్ అవుతోంది.
సిట్టింగ్ ఎంపీ అయి వుండీ, ఎవరో పెత్తనం చేస్తోంటే ఆ పెత్తనానికి తలొగ్గడమేంటని వంగా గీతని కొన్ని చోట్ల ఓటర్లు నిలదీస్తుండడం గమనార్హం.
అన్నట్టు, వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు, ఆ పార్టీ నుంచి గెలిచారు కూడా. అప్పట్లో, పవన్ కళ్యాణ్తో ఆమెకు సన్నిహిత సంబంధాలే వుండేవి. ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో. వంగా గీత, ప్రజారాజ్యం మహిళా విభాగంలో కీలక నాయకురాలిగా పని చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో, ‘వంగా గీత జనసేనలోకి వచ్చేస్తారేమో..’ అని పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు. ‘పవన్ కళ్యాణ్నే వైసీపీలోకి ఆహ్వానిస్తే బావుంటుందా.?’ అని కౌంటర్ ఎటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారుగానీ, వంగా గీత గతంలో తాను పలు పార్టీలు మారిన విషయాన్ని మర్చిపోతే ఎలా.?
‘లక్ష మెజార్టీ’ అని పవన్ కళ్యాణ్ ఏదో ఊరికే అనెయ్యలేదు. పిఠాపురంలో పొలిటికల్ ఈక్వేషన్ అలా వుంది మరి. ఈ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి కావొచ్చు.. ఇతరత్రా సమస్యలు కావొచ్చు, వైసీపీ పట్ల స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. దానికి తోడు టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి.. ఇలా చాలా ఈక్వేషన్స్, వైసీపీ అభ్యర్థి వంగా గీతకు అస్సలేమాత్రం కలిసొచ్చేలా కనిపించడంలేదు.
వాస్తవానికి, ఆమె తిరిగి కాకినాడ ఎంపీగా బరిలో వుంటే.. కాస్తో కూస్తో పాజిటివిటీ వుండేదేమో.! రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది వంగా గీత పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాత్రం ష్యూర్ షాట్.. అన్నట్లుగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.